Anurag Thakur | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కమలం పార్టీకి.. హిమాచల్ప్రదేశ్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిల్ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసెంబ్లీలోని 68 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను సొంతం చేసుకున్నది. మరో 25 చోట్ల బీజేపీ, మూడు స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాగా, ఈ ఎన్నికలు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కి ఇబ్బందికరంగా మారాయి. ఆయన సొంత నియోజకవర్గంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
హమీర్పూర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఐదు శాసనసభ స్థానాలు ఉన్నాయి. అయితే, అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఓటమిపాలవడం గమనార్హం. ఇక్కడ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. ఒక చోట మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందాడు. ఇక ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ దుమాల్ గతంలో ప్రాతినిధ్యం వహించిన సజన్పూర్లోనూ బీజేపీ ఓడిపోయింది. అక్కడ బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 399 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. సజన్పూర్ నుంచి చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమ్ కుమార్.. గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో ఈ ఏడాది ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వస్థలమైన బిలాస్పూర్లోని మూడు స్థానాల్లోనూ బీజేపీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించింది.