Asaduddin Owaisi | బెంగళూరు, జనవరి 20: అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సవాల్ చేశారు. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో శనివారం మీడియాతో మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్ ఏర్పాటు సమయంలో ఆలయం లేదని పేర్కొన్నారు.
బాబ్రీ మసీదును కూల్చకుంటే.. ఈ రోజున జరుగుతున్న వాటిని ముస్లింలు చూడాల్సి వచ్చేది కాదన్నారు. బాబ్రీ మసీదులో ముస్లింలు 500 ఏండ్లకు పైగా నమాజ్ చేశారని, యూపీ సీఎంగా జీబీ పంత్ ఉన్న సమయంలో మసీదులో విగ్రహాలను ఉంచారని పేర్కొన్నారు. అయోధ్య కలెక్టర్గా ఉన్న నాయర్ మసీదును మూసివేసి, అక్కడ పూజలు ప్రారంభించారని ఒవైసీ అన్నారు. రామ మందిరం గురించి మహాత్మాగాంధీ కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదని, ఒక క్రమ పద్ధతిలో బాబ్రీ మసీదును భారతీయ ముస్లింల నుంచి లాగేసుకొన్నారని పేర్కొన్నారు.