తాడిని తన్నేవాడుంటే… వాడి తలదన్నేవాడుంటాడని ఐరోపా వాళ్లకు తెలియదు. కండబలంలో, బుద్ధిబలంలో తమకు తామే సాటి అని ఐరోపా వాళ్లు విర్రవీగుతున్న కాలంలో లండన్లో అడుగుపెట్టిండో భారతీయ పహిల్వాన్. తింటే గారెలే తినాలన్నట్టు.. ఓడిస్తే ఐరోపా వాడినే ఓడించాలని ఓడనెక్కి లండన్ వెళ్లాడు. పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ తొడగొట్టాడు. తెల్లవాళ్లను పడగొట్టి ‘గామా ది గ్రేట్’ అని పిలిపించుకున్నాడు!
గులాం మహమ్మద్ బక్ష్ భట్ని ‘గామా’ అని పిలుస్తారు. ఆయన 1880లో అమృత్సర్లోని పహిల్వాన్ల కుటుంబంలో పుట్టాడు. పదేళ్ల వయసులోనే కుస్తీ పోటీల్లో పతకాలు గెలిచాడు. జోధ్పూర్ మహారాజా నిర్వహించిన కుస్తీ పోటీల్లో భారత దేశంలోని గొప్ప కుస్తీ యోధుల్ని ఓడించాడు.
20వ శతాబ్దం తొలినాళ్లలో దాతియా రాజ్యం (ఇప్పుడిది మధ్యప్రదేశ్లో ఉంది)లో అఖిల భారత కుస్తీ పోటీలు జరిగేవి. ఈ పోటీల్లో కొందరు పహిల్వాన్లు అధర్మ పద్ధతుల్లోనూ తలపడతారు. ఆ పోటీలో ఎం దరెందరో పేరుగాంచిన పహిల్వాన్లతో తలపడి గెలిచాడు. గ్వాలియర్, ఇండోర్, భోపాల్ మొదలైన సంస్థానాల్లో కుస్తీ పోటీలు ఎక్కడ జరిగినా అక్కడ ఓ పట్టుపట్టేవాడు. గెలిచే వచ్చేవాడు!
కుస్తీ పోటీల్లో 1909 నాటికి గామా పహిల్వాన్ అజేయుడు. ఆ కాలానికి స్వాతంత్య్ర పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. ఐరోపా వాళ్లే శారీరకంగా అత్యంత బలశాలులని చెప్పుకోవడం ఒక అపోహ మాత్రమేనంటూ స్వాతంత్య్రోద్యమ నేతలు సవాల్ చేస్తూ వస్తున్నారు. ఐరోపా వాళ్లకు భారతీయులు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించేందుకు తహతహలాడుతున్న జాతీయ వాదానికి గామా ఊపిరిపోశాడు.
జాతీయవాది, బెంగాలీ వ్యాపారవేత్త శరత్ మిత్రాకి భారతీయుల కంటే ఐరోపావాళ్లు ఎక్కువ శారీరక బలం కలిగి ఉంటారన్నది తప్పని నిరూపించాలని కోరిక. దాని కోసం.. గామాను, అతడి సోదరుడు ఇమావ్ు బక్ష్ను వెంటబెట్టుకుని 1910 ఏప్రిల్లో లండన్ చేరుకున్నాడు. అక్కడికిపోయాక.. గామాతో కుస్తీ పోటీల్లో తలపడి గెలువాలని చాలెంజ్ విసురుతూ లండన్ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. ఆ సవాల్ని కుస్తీ ప్రపంచ చాంపియన్ జిసొకో స్వీకరించాడు.
కుస్తీ రింగులో.. ప్రపంచ చాంపియన్ బిసోకోతో భారతీయ పహిల్వాన్ గామా తలపడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 12 వేల మంది ప్రజలు ఆ పోటీ చూసేందుకు తరలి వచ్చారు. వేలాది మంది కేరింతలు, అరుపుల మధ్య కుస్తీ పోరు మొదలైంది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రపంచం ఛాంపియన్ బిసోకో తన ఆధిక్యం ప్రదర్శించేందుకు మూడుసార్లు విఫలయత్నం చేశాడు. నాలుగో రౌండ్లోనూ ఆత్మరక్షణలో పడ్డాడు. వెలుతురు తగ్గిందని పోటీని మరుసటి రోజుకు వాయిదా వేశారు. మరుసటి రోజు పొద్దున పోటీ ప్రారంభమయ్యే సమయానికి జిసొకో రాలేదు. గామాతో తలపడలేక లండన్ విడిచి తన దేశమైన పోలండ్కు పారిపోయాడు. ఆ పోటీలో గామాను విజేతగా ప్రకటించారు.
లండన్లో గామా గెలుపు ప్రభావం భారత దేశంపై పడుతుందని, బ్రిటిష్ అధికారంపై భారతీయుల్లో తిరుగుబాటు స్వభావాన్ని పెంపొందిస్తుందని, ఆందోళనలు పెరుగుతాయని తనకు లేఖలు అందినట్టుగా లండన్లోని ఒక పత్రికా ఎడిటర్ అన్నాడట. ఆయన అన్నది నిజమే అయింది.
ఈ సంఘటనను భారతీయ జాతీయవాద పత్రికలు ‘పశ్చిమాన భారతీయుల గెలుపు’ అంటూ ఘనంగా ప్రచారం చేశాయి. గామాని సత్యం కోసం జరిగిన యుద్ధంలో కౌరవులతో తలపడిన శ్రీకృష్ణుడిగా, భీముడిగా వర్ణించాయి. ఈ యుద్ధంలో కౌరవులు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
గామా భారత దేశానికి తిరిగొచ్చాడు. దేశం అతడిని ఒక హీరోగా కీర్తించింది. అలహాబాద్లో జరిగే భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొనాలని గామాను ఆహ్వానించారు. పాటియాలా మహారాజు గామాకి ఉద్యోగం ఇచ్చాడు. పాటియాలా మహారాజు 1928లో జిసొకో, గామాకి కుస్తీ పోటీకి ఏర్పాట్లు చేశాడు.
ఈ పోటీ కోసం పెద్ద ఆడిటోరియం సిద్ధంచేశాడు. జనవరి 28న జరిగిన ఈ పోటీని ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని నవాబులు, మహారాజులు, గవర్నర్లు తరలివచ్చారు. గామా, జిసొకోకి మధ్య సాగే ఈ కుస్తీ పోటీ కూడా మళ్లీ భారత దేశానికి, పశ్చిమ దేశాలకు పోటీగా ప్రచారమైంది.
పోటీ మొదలైంది. ఆట మొదలైం దో లేదో.. గామా క్షణాల్లో ఒక్కపట్టుపట్టి జిసొకోని మట్టికరిపించాడు. 42 సెకన్లలో కుస్తీ ముగిసింది. ప్రపంచంలో అతితక్కువ సమయంలో ముగిసిన కుస్తీ పోటీల్లో ఇదొకటిగా చరిత్రకెక్కింది. జిసొకోని గామా పడేయగానే స్టేడియంలో ఉన్న వేల మంది లేచి గామాకి జేజేలు పలుకుతూ కేరింతలు కొట్టారు. ‘భారత దేశం గెలిచింది. భారత దేశం గెలిచింది’ అని నినాదాలతో హోరెత్తించారు.
విశ్వవిద్యాలయంలో పనిచేసే జోసెఫ్ ఎస్. ఆల్టర్ ‘భారతీయ మధ్య తరగతి ఆలోచనల్లో జాతీయవాద భావాలు, వలసవాద శక్తి సామర్థ్యాలపై ఉండే సంక్లిష్టమైన ఆలోచనలను గామా మార్చివేశాడు’ అని పేర్కొన్నాడు. భారత జాతి హీరోగా, జాతీయోద్యమ పోరాటానికి ప్రతినిధిగా గామా నిలిచిపోతాడని ఆయన కొనియాడాడు. ఆయన చెప్పిన మాటలు చరిత్రలో అక్షర సత్యాలుగా నిలిచాయి.