Ayodhya | యావత్ భారతదేశం దృష్టంతా అయోధ్య వైపే ఉన్నది. రామ మందిరం ప్రారంభోత్సవంతో పాటు రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కనుల పండువలా సాగింది. ఎన్నో శతాబ్దాల భారతీయుల కల సాకారమైంది. ఈ క్రమంలో భారతంలో పండుగ వాతావరణం నెలకొన్నది. దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆలయం రూపుదిద్దుకొని బాల రాముడు భక్తులకు సాక్షాత్కరించాడు. ఈ నేపథ్యంలో చాలా మంది రాముడి జన్మస్థలమైన అయోధ్యకు వెళ్లాలని భావిస్తుంటారు. అయితే, కేవలం అయోధ్యలో రామ మందిరమే కాకుండా ఇంకా ఎన్నో ప్రసిద్ధి ఆలయాలు, ప్రదేశాలు సైతం ఉన్నాయి. ఎవరైనా అయోధ్యకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాంతాలను సైతం చూడడం అస్సలు మిస్సవ్వొద్దు. అక్కడ ఏయే చారిత్రక, పర్యాటక ప్రాంతాలున్నాయో ఓలుక్కేద్దాం..!
అయోధ్యలో మరో చారిత్రాత్మక ఆలయం ఉన్నది. అదే హనుమాన్గర్హి. ఇక్కడ గుహ కూడా ఉంటుంది. ఇందులోనే హనుమంతుడు నివసిస్తున్నాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకు అయోధ్యకు వెళ్లిన ప్రతి ఒక్కరూ హనుమాన్ గర్హిని సైతం తప్పక దర్శిస్తుంటారు. హనుమాన్ గర్హి ఆలయం నాలుగు వైపుల కోట ఆకారంలో ఉంటుంది. ప్రతి మూలలో వృత్తాకార ప్రాకారాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయానికి చేరుకోవడానికి 76 మెట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ హనుమంతుడు ఆరు అంగులాల ఎత్తులో బాలుడి రూపంలో కనిపిస్తాడు. తల్లి అంజనీదేవి ఒడిలో ఉన్నట్లుగా ఉంటుంది. హనుమంతుడిచే రామనామం రాయబడిన వెండి తులసీహారం అలంకరించి ఉంటుంది. ఆలయ గోడలపై హనుమాన్ చాలీసా శ్లోకాలు కనిపిస్తాయి. ఆలయంలో ఓ స్తంభం ఉంటుంది. దాన్ని విజయం స్తంభంగా పిలుస్తుంటారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించే భక్తులు ముందుగా హనుమాన్ గర్హిని దర్శించడం ఆనవాయితీ.
అయోధ్యలో రామాయణ కాలానికి చెందిన కనక్ భవన్ సైతం ఉంది. శ్రీరాముడు సీతాదేవిని వివాహమాడిన తర్వాత కైకేయి సీతాదేవికి కానుకగా ఇచ్చినట్లు స్థల పురాణం చెబుతున్నది. ఈ భవనం సీతారాముల ఆంతరంగీక భవనంగా ఉండేదని ప్రతీతి. అయోధ్యలో ఉన్న ఈ భవన్ అధ్భుతమైన శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ భవనంలో సీతారాముల విగ్రహాలుంటాయి. తేత్రాయుగం నాటి ఈ భవనం శిథిలావస్థకు చేరితే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించాడని చరిత్ర చెబుతున్నది. మధ్యయుగ కాలంలో విక్రమాదిత్య చక్రవర్తి, ఆ తర్వాత ఓర్చా రాణి వృషభాను కున్వారి పునరుద్ధరించినట్లు స్థల పురాణం చెబుతున్నది. గర్భాలయంలో సీతాదేవితో కలిసి శ్రీరాముడు దర్శనమిస్తాడు.
అయోధ్యకు వెళ్లే వారి తప్పనిసరిగా సరయూ ఘాట్ను తప్పకుండా సందర్శించాల్సిందే. ప్రతి సంవత్సరం రామనవమి, దీపావళి, విజయదశమి వంటి పర్వదినాలలో వేలాది మంది ప్రజలు సరయూ నది ఒడ్డుకు వస్తుంటారు. ఈ నది గురించి పురాతన హిందూ గ్రంథాల్లోనూ ప్రస్తావించారు. శతాబ్దాలుగా యాత్రికులు, పర్యాటకులను ఆకర్షిస్తోంది. అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే రామలక్ష్మణులు అవతారాలు చాలించారని భక్తుల విశ్వాసం. ఈ నదిని గోగ్రానది అని సైతం పిలుస్తుంటారు.
రామచరితమానస్, హనుమాన్ చాలీసాను రచించిన గోస్వామి తులసీదాస్ జ్ఞాపకార్థం నిర్మించారు. తులసీ స్మారక్ భవన్లో అయోధ్య శోధ్ సంస్థాన్ (అయోధ్య పరిశోధన కేంద్రం)గా ఉంది. అయోధ్య నగరం సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సాహిత్య సంప్రదాయాలను అధ్యయనం చేస్తుంది. అయోధ్యలో రామచరిత్ మానస్ రచయిత, సాధువు కవి గోస్వామి తులసీదాస్ జీకి అంకితం చేసిన స్మారక చిహ్నం కూడా కొలువై ఉంది. దీనినే తులసి స్మారక్ భవన్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రార్థనలు, భక్తి సంగీతం, నాటకాలు, రాంలీలా, రామకాంత పారాయణ, తదితర కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ భవనంలో ఉన్న అయోధ్య రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో గోస్వామి తులసీదాస్ సాహిత్య రచనల పెద్ద భాండాగారం సైతం ఉన్నది.
అయోధ్య రామాలయం సందర్శించిన అనంతరం ఇక్కడే కొలువైన నాగేశ్వర్ నాథ్ ఆలయాన్ని సైతం తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీరాముడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించించిన ఆలయమే ఈ నాగేశ్వరనాథ్ ఆలయమని స్థలపురాణం చెబుతున్నది. ఆలయంలోని శివలింగానికి భక్తులు సరయూనది నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకం చేస్తుంటారు. ఈ ఆలయాన్ని రాముడి కుమారుడు కుశుడు నిర్మించాడని ప్రతీతి. 1750 లో నవాబ్ సఫ్దర్ జంగ్ మంత్రి నావల్ రాయ్ ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి సరైన సమయం శివరాత్రి. ఇక్కడ శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ రోజున శివుడి బరాత్ (ఊరేగింపు) సైతం జరుపుతారు.
అయోధ్య ఆధ్యాత్మిక ప్రదేశాలతో పర్యాటక ప్రాంతాలు సైతం ఉన్నాయి. ఇందులో ఒకటి గులాబ్ బారీ. నగరంలోని అత్యంత అందమైన తోటల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పచ్చదనం పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. 8వ శతాబ్దంలో ఈ తోటలో అనేక రకాల రంగురంగుల గులాబీ మొక్కలను నాటారు. ఇక్కడ 1753-1775 మధ్య అయోధ్యను పాలించిన పాలించిన అవధ్ మూడో నవాబ్ అయిన షుజా-ఉద్-దౌలా సమాధి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాలలకు చెందిన ప్రకృతి ప్రేమికులను, వృక్షశాస్త్రజ్ఞులను గులాబీలు ఆకర్షిస్తాయి. ఇస్లామిక్ నిర్మాణ శైలి సమాధి ఉంటుంది. గార్డెన్లోకి ప్రవేశించగానే భారతదేశ జాతీయ చిహ్నంతో కూడిన పెద్ద స్తంభం అందరికీ స్వాగతం పలుకుతుంది. గార్డెన్లో అందమైన మసీదు, దాని పక్కనే చిన్న వాచ్టవర్ ఉన్నది. సమాధి వంపు మార్గాల గుండా నడస్తూ వెళ్తుంటో ఆ అనుభూతే వేరు.
అయోధ్యలో ప్రకృతి సౌందర్యంతో నిండిన చారిత్రక ప్రదేశాల్లో మోతీ మహల్ ఒకటి. చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఫైజాబాద్లో ఉన్న ఒక స్మారక చిహ్నం. చాలా మంది మోతీ మహల్ను ‘పెర్ల్ ప్యాలెస్’ అని కూడా పిలుస్తుంటారు. మోతీ మహల్ అయోధ్య పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. 1743 ఏడీలో నిర్మించబడిన ఈ ప్యాలెస్ అప్పటి నవాబ్ షుజా-ఉద్-దౌలా భార్య రాణి బేగం ఉన్మతుజ్జోహ్రా బాను నివాసంగా ఉండేది. మొఘల్ వాస్తుశిల్పకళ భవనంలో అద్భుతంగా నిలుస్తుంది. వీటితో పాటు ఇంకా రామ్కోట్, శ్రావస్తి తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.