లక్నో, జూన్ 25 : అయోధ్యలోని రామాలయానికి సమర్పించిన విరాళాల్లో కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తును కారణంగా చూపుతూ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) కోరిన ఆర్థిక సమాచారాన్ని అందచేయడానికి శ్రీరామ జన్మభూమి ఆలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిరాకరించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, విరాళాలు, భూమి కొనుగోళ్లు వంటి వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సీనియర్ నాయకుడు రజనీష్ సింగ్ రాసిన లేఖపై స్పందించిన పీఎంవో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ అయోధ్య జిల్లా పాలనా యంత్రాంగానికి ఆ లేఖను పంపింది.
అవసరమైన సమాచారాన్ని అందచేయాలని కోరుతూ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులను జిల్లా యంత్రాంగం సంప్రదించగా ప్రస్తుత సిట్ దర్యాప్తును కారణంగా చూపుతూ సమాచారం అందచేయడానికి ట్రస్టు నిరాకరించినట్లు వర్గాలు తెలిపాయి. సిట్ దర్యాప్తు పూర్తయ్యేవరకు ఎటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసులో 8 మంది నిందితులతో పాటు పలువురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోగా అనుకల్ప్ మిశ్రా అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థ ఉద్యోగి నేరపూరిత కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వక దొంగతనం, అలవాటుగా చేసే దొంగతనం, దొంగతనానికి సహకరించడం, నేరపూరిత విశ్వాస ఘాతుకానికి పాల్పడటం వంటి నేరారోపణలు ఎఫ్ఐఆర్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.