Ayodhya Ram Mandir | అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇప్పటివరకు 1100 కోట్ల రూపాయలకు పైగా వ్యయం అయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ వెల్లడించారు. అయితే ఆలయ పనులు పూర్తి కావడానికి ఇంకో 300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు. తాత్కాలిక మందిరంలోని ఐదారు అంగుళాల పాత రామ్ లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని చెప్పారు. ఇది తక్కువ ఎత్తుతో ఉండటంతో 25-30 అడుగుల దూరం నుంచి భక్తులకు సరిగా కనబడదని, అందుకే దాని స్థానంలో 51 అంగుళాల కొత్త విగ్రహాన్ని తయారు చేయించినట్టు చెప్పారు.
గర్భగుడిలో ప్రతిష్ఠకు మూడు విగ్రహాలను తయారు చేయగా, అందులో మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ చేసిన దానిని ఎంపిక చేశారని, మిగిలిన రెండు విగ్రహాలను కూడా ఆలయంలోనే ఉంచి అన్నిరకాల ఆలయ మర్యాదలతో పూజాధికాలు నిర్వహిస్తామన్నారు. ఒక దానిని శ్రీరాముడికి నగలు, దుస్తులు తయారీకి అవసరమైన కొలతలు తీసుకునేందుకు ఉంచుతామని, కొత్త విగ్రహాల తయారీకి నాలుగైదు నెలల సమయం పట్టిందని ఆయన చెప్పారు.