Champat Rai : అయోధ్య రామాలయంలో విరాళాల మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రామాలయ ట్రస్ట్ చీఫ్ చంపత్రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అయోధ్య రామాలయాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ ట్రస్ట్కు చంపత్ రాయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చంపత్ రాయ్తోపాటు ట్రస్ట్ మరో సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. రామాలయంలో జరిగిన ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తున్నట్లు వారు తెలిపారు.
రామాయంలో భక్తులు సమర్పించిన విరాళాల విషయంలో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. ట్రస్ట్ మెంబర్ అయిన క్రిష్ణ మోహన్ చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఈ ట్రస్టులో గత ఏడాది సెప్టెంబర్లో సభ్యుడిగా చేరారు. ఈ కేసుకు సంబంధించి భక్తులు ఆలయానికి సమర్పించిన పలు ఆభరణాలు ట్రస్టుకు జమ చేయకుండా కొందరు సిబ్బంది, వాటిని తమ సొంతం చేసుకున్నారు. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదు ఇలా ఆలయ ఖజానాకు చేరకుండా దుర్వినియోగమైనట్లు తేలింది. దీనిపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రామాలయ విరాళాల అవకతవకలపై ఘాటుగా స్పందించారు. నిందితులు ఎలాంటివారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఆయన ప్రత్యేకంగా ఈ కేసు విచారణను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితుల్ని సిట్ అరెస్టు చేసింది.
ట్రస్టులో వివిధ పదవుల్లో ఉన్నవారితోపాటు ఆలయానికి సంబంధించి ఇతర వ్యవహారాలు చూసే వారు నిందితులుగా సిట్ గుర్తించింది. అరెస్టైన వారి వివరాలివి. రామ్శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను (ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ), అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే. వీరు విరాళాల్ని లెక్కించడం చేస్తారు. శుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ మిశ్రా. వీరు విరాళాలుగా వచ్చిన నగదు వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. వీరితోపాటు లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్ అనే ఇద్దరిని కూడా సిట్ అరెస్టు చేసింది. ఇంకా, కేసు విచారణ కొనసాగుతోంది.