యావత్తు దేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒంటి గంటకు ముగియనున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా 7 వేల మందికిపైగా ముఖ్య అతిథుల సమక్షంలో ఈ మహత్తర కార్యం జరుగనున్నది. మంగళవారం నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు.
రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 13 వేల మంది పోలీస్ సిబ్బందితో బహుళ అంచెల బందోబస్తు కల్పించారు. నిరంతర నిఘా కోసం 10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. డ్రోన్లనూ రంగంలోకి దించారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని భారత్లోనే కాకుండా విదేశాల్లోని పలు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాషింగ్టన్ డీసీ మొదలుకొని.. పారిస్, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
రామ నామం.. ఇది రమ్యమైనది!
రామ నామం.. ఇది భవ్యమైనది!!
రామ నామం.. ఇది పూజ్యమైనది!
రామ నామం.. ఇది పరిమళమైనది!!
ప్రతి హిందువు నోట శ్రీరామ నామ జపమే..
500 ఏండ్ల కల నెరవేరే శుభ సమయాన
అందరి చూపూ అయోధ్య నగరం వైపే..!
బాలరాముడు కొలువుదీరే సందర్భం వచ్చేసింది!
ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తం ఆసన్నమైనది!!
Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 21: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు వేళయింది. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుంది. రామమందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహా 7 వేల మందికి పైగా ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ మహత్తర కార్యం జరగనున్నది. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షల మంది టీవీలు, స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లలో వీక్షించనున్నారు. ఈ శుభ ముహూర్తాన దేశ విదేశాల్లోని హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు.
వాషింగ్టన్ డీసీ నుంచి ప్యారిస్.. సిడ్నీ దాకా దాదాపు 60 దేశాల్లో విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ వేడుక కోసం శ్రీరామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు, అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. రామమందిరం మొత్తం పూలతో, విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. అయోధ్య వీధులను సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలోని 14 జంటలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాలు పంచుకొంటున్నాయి. ఇప్పటికే ఈ నెల 16 నుంచి ప్రారంభమైన వేడుకలు.. మంగళవారం వరకు కొనసాగనున్నాయి.
ప్రాణ ప్రతిష్ఠ కోసం దేశంలోని అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో అధికార వర్గాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. నగర మూలమూలన పోలీసులు జల్లెడ పడుతున్నారు. అయోధ్య వైపు వచ్చే అన్ని దారులను మూసివేసి, అనుమతిలేని వారిని నిలువరిస్తున్నారు. జైషేమహ్మద్ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. నగరంలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల కదలికలపై 10 వేల సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టడంతోపాటు ప్రారంభోత్సవ వేదిక వద్ద బహుభాషా నైపుణ్యం కలిగిన పలువురు పోలీసు సిబ్బందిని మఫ్టీలో మోహరించారు.
యూపీ యాంటీ టెర్రరిస్టు స్వాడ్(ఏటీఎస్) పోలీసులు శనివారం అయోధ్య నగరంలోని హనుమాన్గర్హి ఏరియా తదితర ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేపట్టారు. సరయూ నదీ తీరాన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు వీవీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మెరుగైన భద్రత కోసం ఏఐ సాంకేతికతను కూడా వినియోగించుకొంటున్నట్టు లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. అటు.. తగినంత మంది అత్యవసర వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. స్థానిక దవాఖానల్లో సరిపడా బెడ్లు ఏర్పాటు చేశారు.
సోమవారం సాయంత్రం అయోధ్య దీపాల కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోనున్నది. మొత్తం 10 లక్షల దీపాలు వెలిగించనున్నారు. రామమందిరం సహా నగరంలో ఉన్న రామ్ కీ పైడీ, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, సరయు ఘాట్, లతామంగేష్కర్ చౌక్, మణిరాం దాస్ ఛవని తదితర ప్రాంతాలు, దాదాపు వెయ్యి ఆలయాలు ఈ దీపాల కాంతులతో వెలిగిపోనున్నాయి. ఈ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్వహిస్తున్నది. ఇక, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక, మంగళవారం నుంచి బాలరాముడు సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.