Kirti Azad | రాముడు అందరివాడని టీఎంసీ మాజీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నారు. దర్భంగాలోని తన నివాసంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జనవరి 22న ప్రజలంతా అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అయితే, అయోధ్యకు వెళ్లవని వారంతా సనాతన ధర్మ వ్యతిరేకులని అనడం సరికాదన్నారు. అయోధ్య రామాలయం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన రోజు ఎంతో సంతోషం కలిగిందన్నారు.
తాము మిథిలా నుంచి వచ్చామని.. అది సీతమ్మవారి జన్మస్థలమన్నారు. మిథిలా శ్రీరాముడి అత్తమామల ఇల్లని అందరికీ తెలుసునన్నారు. రాముడి దేవాలయం నిర్మాణం పూర్తి కావడం కంటే తమకు ఏం సంతోషం ఉంటుందన్నారు. రాముడి జీవితం పవిత్రమైందని.. అయితే, ప్రాణ ప్రతిష్ఠ రోజునే వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అయోధ్యకు వెళ్లకుంటే సనాతన ధర్మ వ్యతిరేకులని అంటారని.. అది ఏమాత్రం సరికాదన్నారు. శంకారాచార్యులు సైతం గుడి ఇంకా పూర్తి కాలేదని.. అసంపూర్తిగా ఉందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు. రామాలయం పూర్తిగా సిద్ధమైన తర్వాత సీతామాత తరఫున లక్షలాది మంది అయోధ్యకు వెళ్లి శ్రీరాముడిని దర్శనం చేసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఆలయం సిద్ధమైన తర్వాత శ్రీరామ నవమి రోజున ప్రాణప్రతిష్ఠ జరగాల్సిందని.. ఉందుకంటే ఆలయంలో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారని తెలిపారు.