అయోధ్య: అయోధ్య రామాలయంలో విరాళాలను దుర్వినియోగం చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ అయోధ్య బార్ అసోసియేషన్(Ayodhya Bar Association) కీలక నిర్ణయం తీసుకున్నది. నిందితుల తరపున కేసును వాదించబోమని లాయర్ల సంఘం తీర్మానించింది. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాలికా ప్రసాద్ మిశ్రా మాట్లాడుతూ.. నిధుల చోరీ కేసులో నిందితులను తరపున ఎవరూ వాదించరు అని, ఒకవేళ వాదిస్తే వారికి 5 లక్షల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. బార్ అసోసియేషన్ మరో నిర్ణయాన్ని కూడా తీసుకున్నది. రామాలయ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా, గోపాల్ రావు.. తక్షణమే అయోధ్య విడిచి వెళ్లాలని డిమాండ్ చేసింది.
మూడు రోజుల్లోగా అయోధ్య నుంచి వెళ్లిపోకుంటే, అప్పుడు సిటీని బ్లాక్ చేస్తామని, ఎవర్నీ లొపలికి రానివ్వకుండా చేస్తామని మిశ్రా తెలిపారు. అయితే ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు కాకపోవడం గమనార్హం. ఈ కేసులోని 8 మంది నిందితుల్లో అవినాశ్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీశ్ కుమార్ యాదవ్, కరుణేశ్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ, రామశంకర్ ఉన్నారు. నిందితులు అందరూ క్యాష్ కౌంటింగ్, విలువైన వస్తువులను భద్రత పరిచే ఉద్యోగంలో ఉన్నారు.
ఈ కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమగ్ర విచారణ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లనున్నట్లు ప్రసాద్ మిశ్రా తెలిపారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రా ప్రస్తుతం ట్రస్టుకు రాజీనామా చేశారు. దానిపై జూలై 7వ తేదీన నిర్ణయించనున్నారు.