న్యూఢిల్లీ: సరిహద్దులో గగనతల ఉల్లంఘనలకు పాల్పడవద్దని చైనాకు భారత్ చెప్పింది. అలాంటి వాటిని మానుకోవాలని సూచించింది. తూర్పు లఢక్ సరిహద్దులో రెచ్చగొట్టే కార్యక్రమాలకు చైనా పాల్పడుతున్నది. జూన్ చివరి వారంలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద గగనతల ఉల్లంఘనకు పాల్పడింది. ఎల్ఏసీకి పది కిలోమీటర్ల పరిధిలోకి చైనా యుద్ధ విమానం వచ్చింది. దీంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) వెంటనే రంగంలోకి దిగింది. భారత యుద్ధ విమానాలను చూసిన చైనా ఫైటర్ జెట్ తోక ముడిచింది.
ఈ ఘటన నేపథ్యంలో భారత్, చైనా మధ్య ప్రత్యేకంగా సైనిక చర్చలు జరిగాయి. తూర్పు లఢక్లోని చుషుల్-మోల్దో సరిహద్దు శిబిరం వద్ద మంగళవారం ఇరు దేశాల సైనిక అధికారులు సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ఆర్మీ ప్రతినిధులతో పాటు ఇరు దేశాలకు చెందిన ఐఏఎఫ్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఆపరేషన్ శాఖకు చెందిన ఎయిర్ కమోడోర్ అమిత్ శర్మ ప్రాతినిధ్యం వహించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వైమానిక దళ సమాన ర్యాంక్ అధికారితో ఆయన చర్చలు జరిపారు. భారత సరిహద్దులో గగనతల ఉల్లంఘనలకు పాల్పడవద్దని సూచించారు.
కాగా, తూర్పు లఢక్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య నిర్దిష్టమైన సరిహద్దులు లేవు. ఈ నేపథ్యంలో అపార్థాలను నివారించేందుకు ఎల్ఏసీ నుంచి పది కిలోమీటర్ల లోపు యుద్ధ విమానాలు రాకూడదని ఇరు దేశాల మధ్య సాధారణ నియమం ఉంది. అయితే చైనా యుద్ధ విమానం ఇటీవల ఈ నియమాన్ని ఉల్లంఘించింది.