హైదరాబాద్, అక్టోబర్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రాజధాని భోపాల్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు వీటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడిగా మరమ్మతులు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని 72 వేల కిలోమీటర్ల రహదారుల్లో 50 శాతానికి పైగా రోడ్లలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. 6 వేల మార్గాల్లో చాలాచోట్ల తారు కొట్టుకుపోయి గుంతలు పడ్డాయని, వాటికి అతుకులు వేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే ఓ నివేదిక అందింది. దీనిపై ఏడాది క్రితం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అయితే కనీసం 25 శాతం కూడా గుంతల మరమ్మతులు పూర్తి కాలేదు.
రాజధాని భోపాల్ ప్రాంతంలో చాలా రోడ్లు గుంతలతో నిండిపోయాయి. భోపాల్, సీహోర్, రాజ్గఢ్, విదిశా, రైసిన్లలో గత వర్షాకాలం భారీ వానలు కురవడం వల్ల రోడ్లు చాలా దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ముఖ్యంగా భోపాల్ నుంచి అయోధ్యకు వెళ్లే బైపాస్ మార్గం చాలా దెబ్బతిన్నది. తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో హుటాహుటిన రోడ్లను మరమ్మతులు చేయాలని, అక్టోబర్ 10లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.