న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కరోనా బాధితులకు సాయం కోసం ప్రధాని మోదీ 2020 మార్చిలో పీఎం కేర్స్ ఫండ్ను ఏర్పాటు చేశారు. ఫండ్కు భారీగా విరాళాలు వచ్చాయి. 2020 మార్చి 27- 2021 మార్చి 21 మధ్య కాలంలో పీఎం కేర్స్ ఫండ్కు వచ్చిన విరాళాలు, ఫండ్ నుంచి చేసిన ఖర్చు వివరాలు తాజాగా ఆడిట్ రిపోర్టుతో వెల్లడి అయ్యాయి. ఈ సమయంలో దాదాపు రూ.11వేల కోట్ల విరాళాలు వస్తే కేవలం రూ.3,976 కోట్లు మాత్రమే(36%) ఖర్చు చేశారు. ఆడిట్ రిపోర్టు ప్రకారం.. పీఎం కేర్స్ ఫండ్ను మార్చి 27న ఏర్పాటు చేశారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ.3,077 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయి.
2021 ఆర్థిక సంవత్సరంలో రూ.7,679 కోట్లు వచ్చాయి. ఇందులో విదేశాల నుంచి వచ్చినవి రూ.495 కోట్లు. పీఎం కేర్స్ విరాళాల్లో రూ.1,311 కోట్లతో 50వేల మేడిన్ ఇండియా వెంటిలేటర్లు కొనుగోలు చేశారు. వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వెయ్యి కోట్లు విడుదల చేశారు. రూ.1,392 కోట్లతో 6.6 కోట్ల కరోనా టీకా డోసులను కొనుగోలు చేశారు. పీఎం కేర్స్ పారదర్శకతపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఖర్చు వివరాలపై సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తులను కూడా కేంద్రం తిరస్కరించింది.
సుప్రీంలో వచ్చే వారం నుంచి భౌతిక విచారణ
దేశంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో వచ్చే వారం నుంచి భౌతిక విచారణ ప్రారంభిస్తామని సుప్రీం కోర్టు సోమవారం ప్రకటించింది. తొలుత బుధ, గురువారాల్లోనే భౌతిక విచారణ జరుపుతామని తెలిపింది. మిగతా రోజుల్లో హైబ్రిడ్(భౌతిక, వర్చువల్) పద్ధతిలో విచారణ జరుగుతుందని పేర్కొన్నది. కరోనా కేసులు తగ్గుతున్నందున భౌతిక విచారణ ప్రారంభించాలని గతవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీజేఐ జస్టిస్ రమణను కోరింది.
అన్ని వేరియంట్లకు ఒకటే టీకా
కరోనా అన్ని వేరియంట్లపై సమర్థంగా పనిచేసే టీకాను తయారు చేసినట్టు కాజీ నజ్రుల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. బెంగాల్లోని అనన్సోల్ ఇన్స్టిట్యూట్, ఒడిశాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ శాస్త్రవేత్తలతో కలిసి దీన్ని తయారు చేసినట్టు వెల్లడించారు. ఈ పప్టైడ్ ఆధారిత వ్యాక్సిన్ భవిష్యత్తులో సంభవించే మహమ్మారులను కూడా నిలువరిస్తుందన్నారు. దీనికి ‘అభిఎస్కోవాక్’ అని పేరు పెట్టారు. ‘ఈ వ్యాక్సిన్ అత్యంత స్థిరమైనది. వైరస్ను ఎదుర్కొనడానికి అవసరమైన ఇమ్యూనిటీని ఇస్తుంది’ అని కాజీ నజ్రుల్ యూనివర్సిటీ పరిశోధకులు అభిగ్యాన్ చౌదరి, సుప్రభాత్ ముఖర్జీ చెప్పారు.
టీకా నమోదుకు ఆధార్ తప్పనిసరి కాదు
కొవిడ్ టీకా కోసం కొవిన్ పోర్టర్లో నమోదు చేసుకోవడానికి ఆధార్కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి రేషన్కార్డు, ఓటర్కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు సహా తొమ్మిది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చని పేర్కొన్నది. న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన ధర్మాసనానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం ఈ మేరకు వెల్లడించింది. కొవిన్ పోర్టర్లో వ్యాక్సిన్ నమోదుకు ఆధార్కార్డు తప్పనిసరి చేయడం సరికాదని దాఖలైన పిల్ను విచారించిన కోర్టు.. గతేడాది అక్టోబర్ ఒకటిన కేంద్రానికి నోటీసులు జారీచేసింది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా అఫిడవిట్ సమర్పించింది.