Atishi Marlena | న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఓ కట్టుకథ అని ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. కేజ్రీవాల్ లేదా ఇతర ఆప్ నేతల వద్ద ఒక్క రూపాయి అయినా దొరికిందా? అని ప్రశ్నించారు. మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి విరాళాలు ఇచ్చాడని, దీనిపై ఈడీ, సీబీఐ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీశారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఆదివారం దేశవ్యాప్తంగా ఒక్కరోజు నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన దీక్షలో ఆతిశీ మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరును ఎండగట్టారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని మద్యం వ్యాపారి శరత్ చంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చి, అప్రూవర్గా మార్చుకొన్నారని ఆరోపించారు. ఓవైపు మద్యం పాలసీ కేసులో శరత్చంద్రారెడ్డి కీలక వ్యక్తి అని ఈడీ, సీబీఐ చెప్పాయని, అయితే బీజేపీకి విరాళం ఇచ్చిన తర్వాతనే ఆయనకు బెయిల్ వచ్చిందని ఆతిశీ గుర్తుచేశారు. ఒక్క రూపాయి దొరక్కపోయినా కేజ్రీవాల్ను అరెస్టు చేశారని, మరి నిందితుడి నుంచి విరాళాలు తీసుకొన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆతిశీ సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ప్రతిపక్ష నేతలపైనే కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయని, ఒక్క బీజేపీ నాయకుడిపై కూడా ఎందుకు దాడులు జరుగడం లేదని ఆతిశీ నిలదీశారు. అవినీతి ఆరోపణలు ఉన్న నేతలు బీజేపీలో చేరితే సచ్ఛీలురు అయిపోతారంటూ ఎద్దేవా చేశారు.
బెదిరించి స్టేట్మెంట్లు..
దేశవ్యాప్తంగా 25 రాష్ర్టాల్లో నిరాహారదీక్షలు చేపట్టినట్టు ఆప్ తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్లోనూ కేజ్రీవాల్ మద్దతుదారులు దీక్షలు చేశారని పేర్కొన్నది. స్వాతంత్ర సమరయోధుడు భగత్సింగ్ స్వగ్రామంలో పంజాబ్ సీఎం భగవంత్మాన్ దీక్షకు కూర్చొన్నారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఆతిశీతో పాటు పలువురు ఇతర మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్, ఆప్ నేతలు పాల్గొన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ శరత్చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డిలను బెదిరించి, బలవంతం చేసి కేజ్రీవాల్ పేరు చెప్పించారని ఆరోపించారు. ఆ తర్వాత వారిద్దరికీ బెయిల్ వచ్చిందని తెలిపారు. గత 20 ఏండ్లుగా అనారోగ్య సమస్యలు ఉన్న మనీశ్ సిసోడియాకు బెయిల్ రాలేదని, కానీ శరత్చంద్రారెడ్డికి మాత్రం వెన్నునొప్పి కారణంతో బెయిల్ ఇచ్చారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు.