న్యూఢిల్లీ: 2019-20 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో జాతీయ పార్టీలకు రూ.3,377.41 కోట్ల ఆదాయం లభించింది. మొత్తం విరాళాల్లో 78 శాతం అధికార బీజేపీదేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పేర్కొంది. అయితే, ఈ నిధుల్లో అత్యధికంగా 78.24 శాతం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిందని బీజేపీ తన అఫిడవిట్లో వెల్లడించింది. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదాయంతో పోలిస్తే బీజేపీ ఆదాయం ఐదు రెట్ల పై చిలుకే. ఇతర ఆరు జాతీయ పార్టీలకు వచ్చిన ఆదాయం కంటే బీజేపీకి మూడున్నర రెట్లు అధికంగా వచ్చింది.
ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రూ.526 కోట్ల విరాళాలు వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలోనే ఈ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చిందని ఏడీఆర్ తెలిపింది. జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఎలక్టోరల్ బాండ్లు 88.64 శాతం ఉంటాయని వివరించింది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో భాజపాకు అత్యధికంగా రూ. 3,623.28కోట్ల ఆదాయం సమకూరగా అందులో ఆ పార్టీ 54.57శాతం ఖర్చు చేసినట్లు నివేదిక తెలిపింది. ఇక కాంగ్రెస్ ఆదాయం రూ. 682.21కోట్లు కాగా.. దీనికంటే 46శాతం అధికంగా హస్తం పార్టీ వ్యయం చేసిందని ఏడీఆర్ నివేదిక తెలిపింది.
దేశంలోని జాతీయ పార్టీలకు విరాళాలు, ఎన్నికల బాండ్ల ద్వారా 2004-20 మధ్య జాతీయ పార్టీలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ.14,651.53 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో మెజారిటీ వాటా బీజేపీదే