Digvijaya Singh : బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘మనం ఒక శక్తితో పోరాడుతున్నాం.. ఆ శక్తిని అంతం చేద్దాం’ అంటూ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి విమర్శనాస్త్రాలుగా మారాయి. తాము ప్రతి మహిళను శక్తి స్వరూపంగా చూస్తామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం శక్తిని అంతం చేస్తామంటోందని, తాము ఆ శక్తిని కాపాడుకుని తీరుతామని ప్రధాని మోదీ రాహుల్కు కౌంటర్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో రాహుల్గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు దిగ్వజయ సింగ్ను ప్రశ్నించగా.. శక్తులు రెండు రకాలు ఉంటాయని, అందులో ఒకటి అసుర శక్తి అయితే, మరొకటి దైవ శక్తి అని చెప్పారు. అసుర శక్తి అంటే అవినీతి, హింస అని వ్యాఖ్యానించారు. అసుర శక్తి ఎప్పుడూ ప్రజలను వేధింపులకు గురిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అసుర శక్తి ఉన్నదని వ్యాఖ్యానించారు.
దైవశక్తి ఎప్పుడూ న్యాయాన్ని కోరుకుంటుందని దిగ్విజయ అన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం పోరాడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ అంతం చేస్తామని చెప్పిన శక్తి ‘అసుర శక్తి’ అని వెల్లడించారు. ఆయన దైవశక్తి ద్వారా న్యాయాన్ని గెలిపించాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.