Aditya-L1 | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రోదసి రంగంలో వినూత్న ప్రయోగాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధకులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ మిషన్పై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) మాజీ కమాండర్ క్రిస్ హ్యాడ్ఫీల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆదిత్య’ మానవాళిని రక్షించే ప్రయోగమని కొనియాడారు. భూమిపై ప్రతిఒక్కరు సాంకేతికతపై ఆధారపడి ఉన్నారని గుర్తుచేసిన ఆయన.. సూర్యుడి గురించి మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు, భానుడి నుంచి ఎదురయ్యే ముప్పులను త్వరితగతిన పసిగట్టేందుకు ఆదిత్య ప్రయోగం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.
13 మిషన్లు ఉన్నప్పటికీ..
సూర్యుడి మీద పరిశోధనల కోసం ఇప్పటికే జపాన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), చైనా దేశాలన్నీ కలిపి 13 వరకు మిషన్లను పంపించాయి. 1981 నుంచి 2022 మధ్య ఈ ప్రయోగాలు జరిగాయి. అయినప్పటికీ, సౌర తుఫాన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని త్వరితగతిన అందించలేకపోయాయి. దీంతో పలు సందర్భాల్లో భారీ నష్టం జరిగింది. ఉదాహరణకు.. 1989లో సూర్యుడి నుంచి కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) (ఒక రకమైన సౌర తుఫాను) విరుచుకుపడింది. ఫలితంగా కెనడాలోని క్యూబెక్ నగరవ్యాప్తంగా మూడు రోజులపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. 2017లో చెలరేగిన మరో సౌర తుఫాను కారణంగా స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ విమానాశ్రయం పరిధిలోని 25 కిలోమీటర్ల మేర దాదాపు 15 గంటల పాటు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల వ్యవస్థలు కుప్పకూలాయి. దీంతో ఎన్నో విమానాలు రద్దయ్యాయి. 2022లో సౌర తుఫాను కారణంగా స్పేస్ఎక్స్కు చెందిన 40 స్టార్లింక్ శాటిలైట్స్ దెబ్బతిన్నాయి. రూ. 413 కోట్ల మేర నష్టంవాటిల్లింది.
ఏటా రూ. 41 లక్షల కోట్లు..
సరైన సమయంలో అలర్ట్ చేయకపోవడంతో సౌర తుఫాన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున రూ. 41 లక్షల కోట్ల మేర విలువైన ఉత్పాదకత దెబ్బతింటున్నది. ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్, జీపీఎస్ శాటిలైట్లు దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. 1859లో విరుచుకుపడ్డ సౌర తుఫాను కారణంగా ఒక్కరోజులోనే రూ.165 లక్షల కోట్ల మేర విలువైన ఉత్పాదకత కోల్పోయినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఏదైనా సౌర తుఫాను భూమిని చేరుకోవడానికి కనీసం 8 నిమిషాల సమయం పడుతుంది. అయితే, ఆదిత్య మిషన్లో ఉన్న ప్రత్యేక పరికరాలు కేవలం ఒక్క నిమిషంలోపే ఈ సమాచారాన్ని భూమికి చేర్చేలా రూపొందించారు. సౌర తుఫాను ఏర్పడటానికి మూడు, నాలుగు రోజుల ముందే ఆ విషయాన్ని శాస్త్రవేత్తలకు చేరవేసేలా ప్రత్యేక వ్యవస్థలు ఆదిత్యలో ఉన్నాయి.
వీఈఎల్సీ.. ఓ అద్భుతం
ఆదిత్య-ఎల్1లోని ప్రధాన సాధనం.. విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ (వీఈఎల్సీ). సూర్యుడి గురించి లోతుగా తెలుసుకోవాలంటే కరోనా (సూర్యుడి మీది వాతావరణం) గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలోనే కరోనా స్పష్టంగా కనబడుతుంది. కానీ, అప్పటివరకూ వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భానుడి నుంచి వచ్చే కాంతిని పూర్తిగా మూసేసి.. సూర్యగ్రహణాన్ని వీఈఎల్సీ కృత్రిమంగా సృష్టిస్తుంది. అలా సూర్యుడి చుట్టూ మసకమసకగా ఉండే కరోనాను నిశితంగా గమనిస్తుంది. దీనికోసం వీఈఎల్సీని 40 ప్రత్యేక దర్పణాలతో రూపొందించారు. గతంలో ప్రయోగించిన ఏ మిషన్లలోనూ ఈ ప్రత్యేకత లేదు.
ఎంతో చవక, మరెంతో శక్తిమంతం
2018లో సూర్యుడి మీద పరిశోధనల కోసం నాసా రూ. 12 వేల కోట్లతో పార్కర్ ప్రోబ్ను పంపించింది. అయితే ఆదిత్య ప్రయోగానికి ఇస్రో వెచ్చించిన మొత్తం రూ.400 కోట్లు మాత్రమే. అంటే, పార్కర్ ప్రోబ్తో పోలిస్తే ఆదిత్య 30 రెట్లు చవకైనది. సూర్యుడి నుంచి వెలువడే విధ్వంసకర సౌర తుఫాన్లు, ప్లాస్మా, జ్వాలల విస్ఫోటాల గురించి లోతైన సమాచారాన్ని అందించేందుకు ఆదిత్య ఎంతో శక్తిమంతమైనది కూడా.
‘ఆదిత్య’ చేసే మేలు ఏంటంటే?
సూర్యుడి పుట్టుక, తీరుతెన్నులు, సీఎంఈల గురించి అర్థం చేసుకోవడమే కాదు.. భానుడి నుంచి వెలువడే హానికారకమైన అతినీలలోహిత కిరణాల (యూవీఏ,యూవీబీ, యూవీసీ) గురించి తెలియజేయడంతో పాటు సౌర తుఫాన్లపై ఆదిత్య అప్డేట్లను ఎప్పటికప్పుడు అందిస్తుంది. తద్వారా భూమిపై జీవరాశిని, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్, విద్యుత్తు వ్యవస్థలను, రోదసిలోని ఉపగ్రహాలను, వ్యోమగాములను రక్షిస్తుంది.