న్యూఢిల్లీ, జనవరి 8: వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్చంద్ర శనివారం విడుదలచేశారు. ఏడుదశల్లో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు పోలింగ్ నిర్వహించి మార్చి 10న ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ ప్రకటనతోనే ఐదు రాష్ర్టాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సుశీల్చంద్ర తెలిపారు. దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తాయని భావిస్తున్న ఈ ఎన్నికలను కేంద్రంలోని అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు చావోరేవో అన్నంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇప్పటికే ప్రచార బరిలోకి దిగాయి. ఐదురాష్ర్టాల్లో కలిపి 18.34 కోట్ల మంది ఓటర్లున్నారు.
ఐదింటిలో నాలుగు బీజేపీ రాష్ర్టాలు
ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో పంజాబ్ మినహా నాలుచోట్ల బీజేపీనే అధికారంలో ఉన్నది. పంజాబ్ కాంగ్రెస్ చేతిలో ఉన్నది. ఈ ఎన్నికల్లో నాలుగు రాష్ర్టాల్లో అధికారం నిలుపుకోవటంతోపాటు పంజాబ్లోనూ పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఉత్తరప్రదేశ్లో బీజేపీని గద్దెదింపటం ద్వారా 2024 పార్లమెంటు ఎన్నికలకు విజయోత్సాహంతో సిద్ధం కావాలని ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి.
15 వరకు ర్యాలీలు బంద్
ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో ఈ నెల 15 వరకు ఎన్నికల ప్రచార ర్యాలీలను ఈసీ నిషేధించింది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపింది. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన కరోనా నిబంధన లను కూడా ఈసీ విడుదలచేసింది.
ఆన్లైన్ నామినేషన్లు
కరోనా దృష్ట్యా ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఆన్లైన్లో నామినేషన్లు వేసే సదుపాయాన్ని ఈసీ కల్పించింది. ఓటర్లు భౌతికదూరం పాటించటం తప్పనిసరి అయినందున పోలింగ్ సమయాన్ని ఒక గంట పెంచారు. ఒక్కో పోలింగ్ బూత్లో 1,250 మంది ఓటర్లు మాత్రమే ఓటువేసేందుకు అనుమతిస్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చును రూ.40 లక్షలకు పెంచారు.