Assembly Elections : కేరళ (Kerala) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) తొలి జాబితా ప్రకటించింది. ఎన్నికల్లో పోటీపడే 55 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను వెల్లడించింది. ఆ జాబితాలో మొత్తం 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ సీనియర్ నేత రమేశ్ చెన్నితాల (Ramesh Chennitala) ను హరిపాడ్ నియోజకవర్గం (Haripad Constituency) నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సన్నీ జోసెఫ్ను పెరవూర్ నుంచి, ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ను పరవూర్ అభ్యర్థిగా బరిలోకి దించింది.
మాజీ సీఎం ఊమెన్ చాందీ కుమారుడు చాందీ ఊమెన్ పూత్తుప్పల్లి అభ్యర్థిగా, లోక్సభ మాజీ సభ్యురాలు రమ్య హరిదాస్.. చిరాయిన్కీజు (ఎస్సీ రిజర్వుడు) నుంచి పోటీపడనున్నారు. మరో మాజీ సీఎం కె కరుణాకరన్ కుమారుడైన మాజీ ఎంపీ కె మురళీధరన్ను వట్టియూర్కావు అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశంలో ఈ జాబితాను ఆమోదించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.
కాగా 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో గత పదేళ్లుగా ఎల్డీఎఫ్ కూటమి చేతిలో ఉన్న అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది.