న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అస్సాం, ఇతర ఈశాన్య రాష్ర్టాలలో 1971 మార్చి 25 తర్వాత ప్రవేశించిన అక్రమ వలసదారుల సమగ్ర వివరాలను తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని గురువారం ఆదేశించింది. అస్సాంలో పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 6ఏ చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సీజేవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగింది. 1966 జనవరి 1 తర్వాత, 1971 మార్చి 25కు ముందు అస్సాంలోకి వచ్చిన విదేశీ వలసవాదులు భారత పౌరసత్వం పొందాలంటే సెక్షన్ 18 ప్రకారం వారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. దీనిపై పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అస్సాం ఒకప్పుడు మయన్మార్లో భాగమని, అనంతరం ఒప్పందంలో భాగంగా దానిని బ్రిటిష్ వారికి అప్పగించారని చెప్పారు. చరిత్రలో వలసవాదులు, ప్రజలు కలిసిపోయి జీవించారని, వారిని వేరు చేయడం సాధ్యం కాదన్నారు. అస్సాం చరిత్రను గమనిస్తే ఎవరు ఎప్పుడు వచ్చారు అన్న అంశాన్ని గుర్తించడం అసాధ్యమని అన్నారు. జనాభా కదలికల్లో సంక్లిష్టతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెక్షన్ 65ఏ అమలు చేస్తే అస్సాంలో సామాజికంగా, రాజకీయంగా చాలా విస్తృతమైన చిక్కులను తెస్తుందని ఆయన అన్నారు.