Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఈశాన్య రాష్ర్టాలు భారత్లో ఎప్పటికీ ప్రత్యేకమే. పేరుకు ఎనిమిది రాష్ర్టాలు ఉన్నప్పటికీ.. లోక్సభలో ఉండే సీట్ల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈశాన్య రీజియన్లో.. గత దశాబ్ద కాలంలో బీజేపీ తన బలాన్ని పెంచుకొన్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 14 ఎంపీ స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ కేవలం 4 సీట్లకే పరిమితమైంది. ప్రాంతీయ పార్టీలు ఏడు స్థానాల్లో విజయం సాధించాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిద్దాం..
అస్సాంలో డీలిమిటేషన్ పనిచేసేనా?
అస్సాంలో చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజనతో లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యలో మార్పు లేనప్పటికీ, నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దుల్లో మార్పులు జరిగాయి. దీంతో ముస్లింలు అధికంగా ఉండే సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. డీమిటేషన్తో బార్పెట లోక్సభ నియోజకవర్గంలో 77 వేల ఓట్లు తగ్గాయి. దీంతో కాంగ్రెస్కు పట్టుండే ఈ స్థానంలో విజయంపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆశలు పెట్టుకొన్నది. బార్పెట స్థానంలో ఎన్డీయే కూటమిలోని అసోం గణపరిషత్(ఏజీపీ) అభ్యర్థి ఫాణి భూషణ్ చౌదరి పోటీచేస్తున్నారు.
మేఘాలయలో బీజేపీకి వెనుక సీటు
రాష్ట్రంలోని సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ప్రభుత్వంలో బీజేపీ జూనియర్ భాగస్వామిగా ఉన్నది. ఇక్కడ రెండు ఎంపీ స్థానాలైన షిల్లాంగ్, తురలో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీకి(ఎన్పీపీ) కమలం పార్టీ మద్దతు ప్రకటించింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉండే మేఘాలయలో.. ఇప్పుడు ఎన్పీపీ, యూడీపీ వంటి ప్రాంతీయ పార్టీలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి.
త్రిపురలో ‘మోత’ వినిపించేనా?
‘గ్రేటర్ తిప్రాల్యాండ్’ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తున్న ప్రద్యోత్ దేవర్మ నేతృత్వంలోని తిప్ర మోత పార్టీతో బీజేపీ జట్టు కట్టింది. రాష్ట్ర స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న భూమి, రాజకీయ హక్కులు, ఇతర సమస్యలను పరిష్కారానికి తిప్ర మోతతో గత నెల కేంద్రం ఒప్పందం చేసుకొన్నది. ఈస్టు త్రిపురలో ప్రద్యోత్ సోదరి కీర్తి సింగ్ పోటీచేస్తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాలు గెలుచుకొన్న తిప్ర మోత పార్టీకి లోక్సభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
అరుణాచల్లో బీజేపీ జోరు
ఈనెల 19న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటుగా రాష్ట్రంలోని రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. అరుణాచల్లో నామినేషన్ల క్రమంలోనే 10 సీట్లను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకోవడం ఆసక్తికర అంశం. ఇందులో సీఎం పెమాఖండూ, డిప్యూటీ సీఎం చౌనా మీన్ ఉన్నారు. ఇదే ఊపుతో రెండు లోక్సభ స్థానాలను కూడా గెలుచుకొంటామని పెమాఖండూ ఆశాభావం వ్యక్తం చేశారు.
నాగాలాండ్, మిజోరంలో ఏం జరిగేను?
ఈ రెండు రాష్ర్టాల్లో ఒక్కో లోక్సభ స్థానం చొప్పున ఉన్నాయి. స్వయం ప్రతిపత్తి ప్రాదేశిక మండలి ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై నాగాలాండ్ తూర్పు రీజియన్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆరు తూర్పు జిల్లాల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని పార్టీలకు సూచిస్తూ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్పీవో) ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చింది. మిజోరం లోక్సభ నియోజకవర్గంలో బహుముఖ పోటీ నెలకొన్నది. అధికార జోరం పీపుల్స్ మూవ్మెంట్(జడ్పీఎం) పార్టీ తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నది.
సిక్కింలో ఎదగాలనుకొంటున్న కమలం
ఈనెల 19న సిక్కిం అసెంబ్లీకి, రాష్ట్రంలోని ఒక్క లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి. జాతీయ అంశాలు, మోదీ ప్రభుత్వ పథకాలతో ఈ హిమాలయ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ ఉవ్వీళ్లూరుతున్నది. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్కేఎం)తో సీట్ల పంపిణీ చర్చలు విఫలమైన తర్వాత రాష్ట్రంలో ఒంటరిగా పొటీచేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో రాజకీయ లక్ష్యంతో బీజేపీ కొత్త ఫైనాన్స్ చట్టం-2023లో ‘సిక్కిమీస్’ నిర్వచనాన్ని విస్తరించింది. స్థానిక లేప్చా, భూటియా, నేపాలీలను దాటి 1975 వరకు పాత స్థిరనివాసుల వారసులను ఇందులో చేర్చింది.
హింస నీడలో మణిపూర్
మైతీ, కుకీ వర్గాల మధ్య ఘర్షణ, అశాంతి పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్లోని రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ఇంఫాల్ లోయలో బహిరంగ సభలు నిర్వహించొద్దని రాడికల్ మైతీ గ్రూపు రాజకీయ పార్టీలకు సూచించగా.. మరోవైపు ఎన్నికలను బహిష్కరించాలని పర్వత ప్రాంతాల్లోని ప్రజలకు కుకీ సంఘాలు పిలుపునిచ్చాయి. కుకీ-జోమి వర్గం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల్లో బరిలో లేకపోవడం ఇదే తొలిసారి. ఈ కమ్యూనిటీలకు ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో 3 లక్షల ఓటు బ్యాంక్ ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు స్థానాలను నిలబెట్టుకోవాలని బీజేపీ, మిత్రపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) కన్నేశాయి.