న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అస్సాంలోని మిలిటెంట్ సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం’ (ఉల్ఫా)తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఓ కీలక ఘట్టంగా నిలిచిపోనున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అస్సాం ప్రజలకు ఈ రోజు మరిచిపోని రోజు అని చెప్పారు. ‘ఉల్ఫా హింస వల్ల అస్సాం ప్రజలు సుదీర్ఘకాలం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దాదాపు 10,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఉల్ఫాతో ఇబ్బందులు ఉండవు. ఇకపై వారంతా ప్రజాస్వామ్య వాదులే’ అని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, అస్సాంలో శాంతిస్థాపనకు కృషి చేయడం, అక్రమ వలసలను అడ్డుకోవడం, భూ హక్కులు లేని కొన్ని స్థానిక సామాజికవర్గాలకు హక్కులు కల్పించడం, అస్సాం అభివృద్ధికి ఆర్థిక ప్యాకేజీ ఇలా పలు అంశాలను శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా తీసుకున్నారు.