Flight services : ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (US, Israel) యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి భారత విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం భారత్ నుంచి పశ్చిమాసియాకు మొత్తం 10 వేల విమాన సర్వీసులు (Flight services) రద్దయినట్లు పౌరవిమానయాన శాఖ (Civil Aviation Ministry) వెల్లడించింది.
యుద్ధానికి ముందు భారత్ నుంచి పశ్చిమాసియాకు రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడిచేవి. ఘర్షణల కారణంగా ఆ సంఖ్య ఇప్పుడు 80-90కి పడిపోయిందని పౌరవిమానయాన శాఖ తెలిపింది. ఇదిలావుంటే సుదూర విమాన ప్రయాణాలకు సంబంధించి పైలట్ల ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ ను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకే డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుందని ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది.