గువాహటి, మే 26: ‘అస్సాం ప్రభుత్వం చైనా నుంచి 50 వేల పీపీఈ కిట్లను కొనుగోలు చేసింది. ఒక రాష్ట్రం సొంతంగా పీపీఈ కిట్లను కొనుగోలు చేయడం దేశంలో ఇదే మొదటిసారి’ అని 2020 ఏప్రిల్ 15న అప్పటి ఆరోగ్య మంత్రి, ప్రస్తుత సీఎం హిమంత బిశ్వ శర్మ ఘనంగా ప్రకటించుకొన్నారు. గువాహటి ఎయిర్పోర్టులో ఓ విమానం పక్కన నిలబడి ఫొటో దిగి ట్వీట్ చేశారు. పీపీఈ కిట్లను మోసుకొచ్చిన విమానం అదేనని చెప్పారు.
కానీ, అది ఉత్తదేనని, హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద తెలిసింది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట. ఆయన అనుకొన్నట్టుగానే పీపీఈ కిట్ల ప్లాన్ బాగా వర్కవుట్ అయింది. జనాల్లో బాగా ప్రచారం జరిగింది. తర్వాత ఆయనను బీజేపీ అధిష్ఠానం అస్సాం సీఎం పీఠంపై కూర్చోబెట్టింది.