అధికార బీజేపీకి విపక్షాల సూటి ప్రశ్న
దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్
గువాహటి, జూన్ 4: విపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ పెద్దలు.. అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ అవినీతిపై ఎందుకు నోరు మెదపడంలేదని విపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఎప్పుడో ఏడేండ్ల కిందటి కేసును తిరగదోడి ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ను ఆగమేఘాలపై ఇటీవల అరెస్టు చేసిన ఈడీ.. ‘పీపీఈ కిట్ల’ స్కామ్లో బిశ్వశర్మపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డాయి. బిశ్వశర్మ భార్యకు చెందిన కంపెనీకి కరోనా లాక్డౌన్కు ముందు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీపీఈ కిట్ల ఆర్డర్ ఇవ్వడంపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించి ప్రధాని మోదీ నిజాయితీ చాటుకోవాలని సవాల్ విసిరాయి.
అవినీతి కనిపించడంలేదా?
మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు పీపీఈ కిట్లను కోట్ చేసిన బంధువుల కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా బిశ్వశర్మ ప్రవర్తించారని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ‘సీఎం భార్య కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టులో ఒక్కో పీపీఈ కిట్ కొనుగోలుకు ప్రభుత్వం రూ. 990 చొప్పున చెల్లించింది. అదే రోజు మరో కంపెనీ నుంచి ఇతరులు పీపీఈ కిట్ను రూ. 600కే కొనుగోలు చేశారు. ఇదో పెద్ద నేరం’ అని ఆయన మండిపడ్డారు. ‘తప్పు చేసిన సొంత పార్టీ నేతపై చర్యలు తీసుకొనే దమ్ము బీజేపీకి ఉన్నదా?’ అని సవాల్ విసిరారు. లేదా, ఎప్పటిలాగే ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ కేంద్రప్రభుత్వం వేధింపులను కొనసాగిస్తుందా? అని ఎద్దేవా చేశారు. ‘విపక్ష నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అవినీతి గురించి మాట్లాడే బీజేపీ నేతలకు ఈ స్కామ్ అవినీతిగా కనిపించడంలేదా? ఈ విషయంపై ఆ పార్టీ నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
సుప్రీం పర్యవేక్షణలో..
పీపీఈ కిట్ల స్కామ్పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ సంస్థలతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్, రాయ్జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషద్ (ఏజేపీ) డిమాండ్ చేశాయి. మరోవైపు, పీపీఈ కిట్ల స్కామ్ వార్తలను అస్సాం ప్రభుత్వం ఖండించింది. పీపీఈ కిట్ల సరఫరాలో ఎలాంటి కుంభకోణం జరుగలేదని, సీఎం భార్య, కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారంతో ఏ మాత్రం సంబంధం లేదని రాష్ట్రమంత్రి పిజూశ్ హజారికా అన్నారు. కాగా, తనపై సిసోడియా చేసిన ఆరోపణలు అవాస్తమని, ఆయనపై పరువునష్టం దావా వేస్తానని బిశ్వశర్మ హెచ్చరించారు.
ఏమిటీ వివాదం?
కరోనా సంక్షోభ సమయంలో తన భార్య, కుటుంబసభ్యులకు చెందిన ఫార్మా, హెల్త్కేర్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా బిశ్వశర్మ నిర్ణయాలు తీసుకొన్నారు. పీపీఈ కిట్ల తయారీలో ఏ మాత్రం అనుభవం లేనప్పటికీ ఆ కాంట్రాక్టులను అప్పనంగా ఈ కంపెనీలకు కట్టబెట్టారు. ఆయా కంపెనీలు ఈ కాంట్రాక్టులను సకాలంలో, నిబంధనల మేరకు పూర్తి చేయలేదు. అయినప్పటికీ, తదుపరి టెండర్లలోనూ ఈ కంపెనీలనే అస్సాం ప్రభుత్వం ఎంచుకొన్నది. 2020లో జరిగిన ఈ స్కామ్ సమాచార హక్కు చట్టం ద్వారా ఇటీవల వెలుగుచూసింది. అప్పుడు బిశ్వశర్మ ఆరోగ్యమంత్రిగా ఉన్నారు.