గువహటి : ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రెండవ పెండ్లి చేసుకోరాదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) అన్నారు. తమ సర్వీస్ నిబంధనల ప్రకారం అసోం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రెండో వివాహానికి అనర్హుడని చెప్పారు. ఏదైనా మతంలో మీరు రెండో వివాహం చేసుకునే వెసులుబాటు ఉంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఉద్యోగి మరణానంతరం పెన్షన్ గురించి ఇద్దరు భార్యల మధ్య వివాదం తలెత్తుతోందని ఇలాంటి అంశాలను పరిష్కరించడం సంక్లిష్టంగా మారినట్టు గుర్తించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రెండో వివాహం చేసుకోరాదని సర్వీస్ నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఈ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించుకున్నామని సీఎం చెప్పారు.
అక్టోబర్ 20న అదనపు ప్రధాన కార్యదర్శి నీరజ్ వర్మ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉత్తర్వులు జారీ చేశారు. బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ ఓ చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన క్రమంలో అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసోం అడ్వకేట్ జనరల్ దేవజిత్ లోన్ సైకియా నేతృత్వంలో అసోం ప్రభుత్వం బహుభార్యత్వం రద్దుపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా నియమించింది.
Read More :