(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మరో వివాదంలో చిక్కుకొన్నారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా జార్ఖండ్లో ఆదివారం ఓ సభలో రాహుల్ ఓ కార్యకర్త చేతికి కుక్క తినే బిస్కెట్ ఇచ్చారు. తొలుత కుక్కకు బిస్కెట్ను ఆఫర్ చేసిన రాహుల్.. అది తినడానికి నిరాకరించడంతో పక్కనే ఉన్న ఓ వ్యక్తికి ఆ బిస్కెట్ను ఇచ్చారు. ఈ వీడియోను బీజేపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ రాహుల్ వైఖరిపై మండిపడ్డారు.
బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఈ వీడియోను షేర్ చేస్తూ.. రాహుల్పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ‘కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ బూత్ ఏజెంట్లను కుక్కలతో పోల్చారు. ఇప్పుడు రాహుల్ కుక్క తినే బిస్కెట్లను కార్యకర్తలకు ఇస్తున్నారు. కార్యకర్తలంటే కుక్కలా? కార్యకర్తలను కుక్కలుగా చూసే అధ్యక్షుడు, యువరాజు ఉన్నందుకు ఆ పార్టీ కనుమరుగవ్వడం సహజమే’ అని ఎద్దేవా చేశారు. ఈ వీడియోపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా స్పందించారు. ‘రాహుల్ గాంధీ మాత్రమే కాదు. ఆయన కుటుంబం మొత్తం కలిసినా నన్ను ఆ బిస్కెట్ను తినేలా చేయలేకపోయారు. నేను ఆత్మాభిమానం ఉన్న అస్సామీని, భారతీయుడిని. అందుకే రాహుల్ పెంపుడు కుక్కతినే ప్లేటులో బిస్కెట్లను నాకు ఆఫర్ చేస్తే నిరాకరించా. కాంగ్రెస్కు రాజీనామా చేశా’ అంటూ గతంలో జరిగిన ఘటనను ఉటంకిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
వివాదం ముదురుతుండటంతో ఈ ఘటనపై రాహుల్ స్పందించారు. వీడియోలో తాను మాట్లాడిన కార్యకర్తదే ఆ కుక్కపిల్ల అని పేర్కొన్నారు. బిస్కెట్ తినేందుకు కుక్క నిరాకరించడంతో దాని యజమానికి బిస్కెట్ ఇచ్చానని, ఇందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు.