గువాహతి: అస్సాంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అరెస్టులు ఆయా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తోందని గువాహతి హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అరెస్టైన వ్యక్తులకు పిల్లలు, కుటుంబ సభ్యులు, వృద్ధులు ఉన్నారని పేర్కొంది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. వారిపై లైంగిక దాడి ఆరోపణలు ఉన్నాయా? అని నిలదీసింది. ఇవన్నీ అసహజ ఆరోపణలేనని విమర్శించింది. ఈ కేసుల నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అలాంటి నేరం ఎవరైనా చేసినట్లుగా మీరు భావిస్తే చార్జిషీట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
కాగా, బాల్య వివాహాలను ఖండించాల్సిందేనని హైకోర్టు తెలిపింది. అయితే పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన కఠినమైన చట్టం కింద అభియోగాలను నమోదు చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ ఆరోపణల కింద అరెస్ట్ చేసిన వారందరిని జైలులో ఉంచడం సరైనదేనా? అని ప్రశ్నించింది. దీనిపై తమ అభిప్రాయాలు తెలియజేస్తామని కోర్టు పేర్కొంది. తొమ్మిది మంది వ్యక్తులకు ముందస్తు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు రాష్ట్రంలో బాల్య వివాహాలను నిషేధించేందుకు అస్సాం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై బాల్య వివాహ నిషేధిత చట్టం కింద, 14 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలను పెళ్లి చేసుకున్న వారిపై అదనంగా పోక్సో చట్టం కింద ఆ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 3 నుంచి ఇప్పటి వరకు నాలుగు వేలకుపైగా కేసులు నమోదు చేశారు. మూడు వేల మందికిపైగా మగవారిని అరెస్ట్ చేశారు. వారందరినీ తాత్కాలిక జైళ్లలో ఉంచారు. దీనిపై ఆయా వ్యక్తుల భార్యలు, తల్లులు మండిపడుతున్నారు. వారంతా నిరసనలు చేస్తున్నారు.
కాగా, బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వం చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడో జరిగిన బాల్య వివాహాలపై ఇప్పుడు కేసులు నమోదు చేసి మగవారిని అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. మరోవైపు పోక్సో చట్టం కింద అభియోగాలు మోపడాన్ని న్యాయ నిఫుణులు కూడా ప్రశ్నిస్తున్నారు.