Piyush Goyal | ముంబై, ఫిబ్రవరి 8: పన్నులు చెల్లించిన దామాషా ప్రకారం కేంద్ర నిధులు కావాలని కొన్ని రాష్ర్టాలు, కొందరు నేతలు డిమాండ్ చేయడం అల్పమైన ఆలోచన అని, దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ పేర్కొన్నారు. గురువారం ముంబైలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం వృద్ధి చెందాలంటే ఈశాన్య రాష్ర్టాలతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ కూడా కచ్చితంగా అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని చెప్పారు.
‘తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాలతో పాటు మహారాష్ట్రలో గతంలో అధికారంలో ఉన్న వారు కేంద్రానికి చెల్లించిన పన్నుల సొమ్ము మొత్తం కేంద్ర నిధుల కింద తిరిగి రాష్ర్టాలకు రావాలని అడుగుతుంటారు. ఇంతకంటే అల్పమైన ఆలోచన మరొకటి ఉండదు. ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.