లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పందించారు. కేంద్ర మంత్రి అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ ఇవ్వలేదని తెలిపారు. ఓం ప్రకాష్ రాజ్భర్ దీని గురించి అమిత్ షాను అడగాలని ఆయన అన్నారు. (Ram Gopal Yadav) అమిత్ షాకు తాను ఎలాంటి లేఖ సమర్పించలేదని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నేను ఏదైనా లేఖ సమర్పించానా లేదా అనేది అమిత్ షాను మీరు అడగాలి’ అని రాజ్భర్ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు.
కాగా, ఓం ప్రకాష్ రాజ్భర్ ఎప్పుడూ ఇలాగే మాట్లాడతారని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. దేశంలో ఎవరూ కూడా ఆయన మాటలను సీరియస్గా తీసుకోరని చెప్పారు. ‘అసలు తానేం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు’ అని ఆరోపించారు.
మరోవైపు తమ పార్టీలో అంతా సవ్యంగానే ఉన్నదని ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ చీలికపై వస్తున్నవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని అన్నారు. ‘పార్టీలో ఎలాంటి సమస్య లేదు, భవిష్యత్తులోనూ ఉండదు. వారు కేవలం వదంతులు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు వారిని తిట్టుకుంటారు’ అని మండిపడ్డారు.