న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ‘వృద్ధులకు రైల్వే టికెట్పై రాయితీ ఇవ్వటం కుదరదు. సబ్సిడీలతో ఏటా రూ.59 వేల కోట్ల భారం పడుతున్నది’ ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు చెప్తున్న మాట. కానీ, అదే కేంద్రం బడాబాబులకు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నది. గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసింది. అలాగే రెండేండ్లలోనే పన్ను రాయితీల రూపంలో కార్పొరేట్ కంపెనీలకు రూ.1.84 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది. రైళ్లలో వృద్ధులకు రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారని బుధవారం లోక్సభలో మహారాష్ట్ర ఎంపీ నవ్నీత్ రాణా అడిగిన ప్రశ్నకు.. రైలు టికెట్ల ధరపై వృద్ధులకు రాయితీని పునరుద్ధరించేది లేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాయితీ వల్ల గత ఏడాది రైల్వే శాఖపై రూ.59 వేల కోట్ల భారం పడిందని వెల్లడించారు. ‘గత ఏడాది రూ.59 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చాం. ఇది కొన్ని రాష్ర్టాల వార్షిక బడ్జెట్ కన్నా ఎక్కువ. ఏటా పెన్షన్ల బిల్లు రూ.60 వేల కోట్లు, జీతాల బిల్లు రూ.97 వేల కోట్లు, ఇంధనం బిల్లు రూ.40 వేల కోట్లు అవుతున్నది. ఇంత ఖర్చు అవుతుండగా, మళ్లీ సబ్సిడీ అంటే కష్టం’ అని వివరించారు. ఒకవేళ కొత్త సదుపాయాలు వస్తే, వాటిపై నిర్ణయం తీసుకొంటామని, ఇప్పటికైతే రైల్వే శాఖ పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా.. 41 మేజర్ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని, మిగతా రైల్వే స్టేషన్లను దశలవారీగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు 500-550 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయని, స్లీపింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే మరింత దూరం ప్రయాణించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2030 నాటికి రైల్వేశాఖను కాలుష్య రహితంగా మార్చేలా లక్ష్యం పెట్టుకొన్నామని పేర్కొన్నారు.
విద్యార్థుల ఫెలోషిప్లు రద్దు
విద్యార్థుల స్కాలర్షిప్, ఫెలోషిప్లను కూడా కేంద్రం ఒక్కొక్కటిగా ఎత్తివేస్తున్నది. జాతీయ అర్హత పరీక్ష (నెట్) కాకుండా, వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఫిల్, పీహెచ్డీ సీట్లలో చేరే విద్యార్థులకు యూజీసీ ద్వారా ఫెలోషిప్లను కేంద్రం రద్దు చేసింది. దీంతో పరిశోధనల కోసం ప్రతీనెలా అందే రూ. 25 వేల మొత్తానికి విద్యార్థులు దూరమయ్యారు. మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (ఎంఏఎన్ఎఫ్)ను కూడా రద్దు చేసింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ ఇచ్చే ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ను ఆపేసింది. ఎల్పీజీపై రూ. 400 వరకు ఉన్న సబ్సిడీని ఎత్తేసింది. ఉజ్వల పథకం కింద పేదలకు ఇస్తున్న ఉచిత సిలిండర్ల పథకానికి 95 శాతం నిధులను తగ్గించింది.