జైపూర్ : యూపీలోని లఖింపుర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఇతర నేతలను అడ్డుకుని అక్రమ నిర్బంధాలకు పాల్పడటాన్ని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ఖండించారు. విపక్ష నేతల నిర్బంధం ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమని అన్నారు. ప్రియాంకతో పాటు చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రాంధ్వా తదితరులను యోగి సర్కార్ అడ్డగించిందని చెప్పారు. నియంత ప్రభుత్వమే ఇలాంటి నిర్బంధాలకు పూనుకుంటుందని గెహ్లోత్ పేర్కొన్నారు.
లఖింపూర్ ఖేరిలో రైతుల ఆందోళనలో హింస చెలరేగడంతో నలుగురు రైతులు సహా 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అజయ్ కారుతో పాటు మరో వాహనం రైతులపై దూసుకుపోవడంతో నలుగురు రైతులు మరణించగా అనంతరం చెలరేగిన అల్లర్లో మరో నలుగురు మరణించారు. లఖింపూర్ ఖేరిలో ఆదివారం మరణించిన రైతుల కుటుంబాలను కలిసేందుకు వెళుతున్న ప్రియాంక గాంధీతో పాటు ఇతర విపక్ష నేతల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజస్ధాన్ సీఎం గెహ్లోత్ పేర్కొన్నారు.