లక్నో, సెప్టెంబర్ 21: ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ గత 6 నెలల నుంచి ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు మరోసారి ఆందోళనకు దిగారు. పెండింగ్ వేతనాల కోసం నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోరఖ్పూర్ నియోజకవర్గం సహా యూపీ తూర్పు ప్రాంతంలో ఈ నెల 15 నుంచి ఈ సమ్మె కొనసాగిస్తున్నారు. వెంటనే వేతన బకాయిలు చెల్లించడంతోపాటు తమ నెలవారీ వేతనాన్ని రూ.21 వేలకు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా హోదా కల్పించాలని యోగి సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు.
వేతన సమస్యలను పరిష్కరించడంతోపాటు 10 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఖుషీనగర్, మహరాజ్గంజ్, డియోరియా, గోరఖ్పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోని ఆశా వర్కర్ల ప్రతినిధులు తమ చీఫ్ మెడికల్ ఆఫీసర్లకు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించారు. వేతన బకాయిలను ఈ నెల 30లోగా చెల్లిస్తామని వారు హామీ ఇచ్చారని, దీన్ని నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఉద్యమాన్ని చేపట్టి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. స్తుతం తమ వద్ద ఉన్న కొద్దిపాటి నిధులతో ఆశా వర్కర్లకు చెల్లింపులు జరుపుతామని, కానీ.. ప్రభుత్వం నిధులను విడుదల చేసే వరకు మిగిలిన బకాయిలను తీర్చలేమని గోరఖ్పూర్లో ఓ అధికారి చెప్పారు.
ఈ సమ్మెకు ముందు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆశావర్కర్లు ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. తమకు కనీస వేతనాలు చెల్లించడంతోపాటు వివిధ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొవిడ్ కష్టకాలంలో ప్రజలకు తాము అందించిన నిస్వార్థ సేవలను గుర్తించేందుకు, తమను శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్ధీకరించేందుకు యోగి సర్కార్ సిద్ధంగా లేదని ధ్వజమెత్తారు. అనంతరం 10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారు. కానీ, నాడు ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు.
క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తున్నదని బహరాయిచ్లో ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న ఆశా కార్యకర్త సీమా యాదవ్ విమర్శించారు. ‘కొవిడ్ సంక్షోభ సమయంలో మేము ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించాం. ఈ మహమ్మారి బారిన పడి మా సహచరుల్లో చాలా మంది మరణించారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన నెలవారీ వేతనాన్ని అందజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు హోదా కల్పించాలి. న్యాయబద్ధమైన ఈ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోగా గత 6 నెలల నుంచి మా వేతనాలను విడుదల చేయడం లేదు’ అని ఆమె మండిపడ్డారు.
మండుటెండను సైతం లెక్కచేయకుండా మేము ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాం. దీంతో మాలో కొంత మంది అనారోగ్యం పాలవుతున్నారు. మేము ఇంట్లో కూర్చుంటే ఎంతో మంది ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. అందుకే ఎన్ని కష్టాలున్నా విధులను కొనసాగిస్తున్నాం. కానీ, ఈ ఏడాది మార్చి నుంచి మాకు వేతనాలు అందడం లేదు. ఆరు నెలల నుంచి ప్రభుత్వం నయాపైసా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. కుటుంబ రోజువారీ ఖర్చుల కోసం నగలను తాకట్టు పెట్టాల్సి వస్తున్నది.
– అనూ దేవి, ఆశా కార్యకర్త