న్యూఢిల్లీ : యూపీలో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే తమ ప్రధమ లక్ష్యమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని ఓ వార్తా చానెల్తో మాట్లాడుతూ అసదుద్దీన్ తేల్చిచెప్పారు. తాము పోటీ చేసే 100 స్థానాల్లో తమ పార్టీ ఎలాంటి సామర్ధ్యం కనబరుస్తుందనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. కులం, మతం ఆధారంగా వివక్ష చూపని పార్టీలు, వ్యక్తులను తమ పార్టీ కోరుకుంటుందని చెప్పారు.
ఏఐఎంఐఎం బీజేపీకి బీ టీం అనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తమ పార్టీ బీజేపీకి బీ టీం కాదని స్పష్టం చేశారు. యూపీలో మైనారిటీలను బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీలు నిర్లక్ష్యం చేశాయని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. యూపీలో ముస్లింల సామాజికార్ధిక ప్రమాణాలు దయనీయంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో ఎస్పీ పాలనా పగ్గాలు చేపట్టాలని శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఆక్షేపించారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. యూపీలో మరోసారి అధికారం నిలుపుకోవాలని యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్ పోరాడుతుండగా అధికారం దక్కించుకుని కాషాయ పార్టీకి షాక్ ఇవ్వాలని అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ సన్నద్ధమైంది. ఇక ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్, బీఎస్పీలు ప్రయత్నిస్తున్నాయి.