న్యూఢిల్లీ : ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంను తక్షణమే రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీంపై జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా కాంట్రాక్టు పద్ధతిలో సైనికుల నియామకాన్ని చేపట్టే అగ్నిపథ్ను సమర్ధించేందుకు ఎన్ఎస్ఏను ముందుకు తెచ్చారని ఓవైసీ ఎద్దేవా చేశారు. తన నిర్ణయాన్ని బాహాటంగా సమర్ధించుకునే ధైర్యం 56 అంగుళాల ఛాతీకి లేక ఇతరుల వెనుక దాగిఉన్నారని మోదీని దుయ్యబట్టారు.
దేశ యువత వాదనలను విని అగ్నిపథ్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఓవైసీ కోరారు. ఆధునిక యుద్ధాల్లో కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడాలంటే సాంకేతిక పటిమ, నైపుణ్యాలు అవసరమని దీనికోసం మనం మారాల్సి ఉందని అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ స్పందించారు. కాంట్రాక్టు పద్ధతిలో స్వల్పకాలానికి సరైన శిక్షణ లేకుండా చేరే సైనికులతో ఆధునిక యుద్ధాలను సైన్యం ఎలా ఎదుర్కొంటుందని ప్రశ్నించారు.
ఆధునిక సాంకేతికత అంటే మెరుగైన సైనిక సామర్ధ్యమని, దాన్ని తారుమారు చేయడం కాదని ఓవైసీ అన్నారు. అగ్నిపథ్ స్కీంతో సంప్రదాయ సైనిక వ్యవస్ధలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గూర్ఖా రెజిమెంట్ అని పిలిచే రెజిమెంట్లో ఒక తమిళుడు, ఓ కశ్మీరీ, ఓ హర్యానా సైనికుడు ఉంటే అది గూర్ఖా రెజిమెంట్గా ఉనికిని కొనసాగిస్తుందా అని ఓవైసీ ప్రశ్నించారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామక పధకంతో సంప్రదాయ సైనిక వ్యవస్ధలు అంతరించిపోతాయని ఎన్ఎస్ఏ గుర్తెరగాలన్నారు.