మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాలంలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మహిళల వివాహ వయసు పెంచేదుకు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురానుందని సమాచారం. దీంతో దేశ వ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయసుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదీ మన దేశంలో పితృస్వామ్యం ప్రభుత్వం అని చెప్పడానికి ఉదాహరణ.. మన ప్రభుత్వం పొరిగింటి అంకుల్లాగా వ్యవహరిస్తోంది అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లు నిండిన పురుషులు, మహిళలు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చు, వ్యాపారాలు ప్రారంభించగలరు, ప్రధానమంత్రిని ఎన్నుకోగలరు.. అంతేకాదు ఎంపీలు , ఎమ్మెల్యేలను ఎన్నుకోగలను కానీ 18 ఏళ్లకు వివాహం మాత్రం చేసుకోలేరా అంటూ ట్విట్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలు ఏం తినాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో.. ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు.
బాల్య వివాహాలను నిషేధిస్తూ చట్టం ఉన్నప్పటికీ బాల్య వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఒవైసీ అన్నారు. భారతదేశంలోని ఏటా అనేకమంది బాలికలకు 18 ఏళ్లలోపు వివాహాలు జరుగుతున్నాయని.. అయితే దేశ వ్యాప్తంగా బాల్య వివాహాలపై 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. అయితే బాల్య వివాహాలు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయంటే దానికి కారణం చట్టం కాదు.. బాలికల్లో వచ్చిన విద్య , ఆర్థిక పురోగతి మాత్రమే కారణమని చెప్పారు.
అంతేకాదు ప్రధాని మోడీకి నిజాయితీ ఉంటే మహిళలకు ఆర్థిక అవకాశాలను పెంపొందించడంపై దృష్టి సారించి ఉండేవారని ఒవైసీ అన్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గుతున్న ఏకైక దేశం భారతదేశం అని ఆయన చెప్పారు.
మిగతా దేశాలతో పోలిస్తే
“అమెరికా, న్యూజిల్యాండ్ లాంటి దేశాలలో మహిళలు 14, 16 వయస్సులో పెళ్లి చేసుకునేందుకు చట్టాలు అనుతిస్తున్నాయి. ఆయా దేశాలలో తక్కువ వయస్సులోనే నిర్ణయం తీసుకునే శక్తి వారిలో పెంపొదించడానికి అక్కడి ప్రభుత్వాలు చేసే చట్టాలు దోహదపడుతున్నయి ” అని ఒవైసీ వ్యాఖ్యానించారు.