న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఆందోళనల వల్ల సభా కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. దీంతో విలువైన సభా సమయం వృధా అవుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు కోరినట్లు స్పీకర్ ఓం బిర్లా .. ప్రధానిపై అవిశ్వాస తీర్మానం చర్చకు అంగీకరించారని, ఈ నేపథ్యంలో సభ సక్రమంగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలని ఓవైసీ తెలిపారు. ఓ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ సూచనలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించారు కాబట్టి, సభ సజావుగా సాగితే బాగుంటుందని ఓవైసీ అన్నారు. నిరసనల వల్ల విలువైన సభా సమయాన్ని కోల్పోతున్నామన్నారు. ఎన్నో రోజుల సెషన్ను కోల్పోయామని, ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నామని, కానీ నిరసనల వల్ల కుదరడం లేదన్నారు. గందరగోళం మధ్యే కీలకమైన బిల్లులను పాస్ చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.