భోపాల్: అనారోగ్యానికి గురైన తండ్రిని ఒక చిన్న పిల్లవాడు తోపుడు బండిపై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మూడు కిలోమీటర్ల వరకు ఆ చెక్క బండిని తోశాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బలియారిలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఒక పేద వ్యక్తి శనివారం అనారోగ్యానికి గురయ్యాడు. అతడి కుటుంబం అంబులెన్స్ కోసం ఫోన్ చేసింది. అయితే గంటకుపైగా ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేమీ లేక చెక్క తోపుడు బండిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టారు. ఆ వ్యక్తి భార్య, కుమారుడైన చిన్న పిల్లవాడు ఆ బండిని తోశారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అతడ్ని తీసుకెళ్లారు.
కాగా, ఆసుపత్రి వద్ద కొందరు వ్యక్తులు దీనిని చూశారు. తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డు చేశారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో మధ్యప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని కొందరు విమర్శించారు. మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ప్రజలకు అంబులెన్స్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ‘బహుశా మధ్యప్రదేశ్లో అంబులెన్స్లు పేదల కోసం కాదేమో. అందుకే రోగిని చెక్క తోపుడు బండి మీద పడుకోబెట్టి భార్య, చిన్న పిల్లవాడు ఆసుపత్రికి తీసుకెళ్లారు’ అని ఒకరు ఎద్దేవా చేశారు.
మరోవైపు ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లింది. దీని గురించి ఆరా తీయగా అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలా జరిగినట్లు తెలిసింది. దీంతో అంబులెన్స్లు ఎందుకు అందుబాటులో లేవు అన్నదానిపై దర్యాప్తు చేయాలని వైద్య అధికారులను సింగ్రౌలీ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఆదేశించారు.
शायद मध्य प्रदेश की एंबुलेंस गरीबों के लिए नहीं है,
इसलिए मरीज़ को ठेले पर लिटाकर अस्पताल ले जाया जा रहा है!!वीडियो मे मरीज़ की पत्नी और बेटे ठेले को धक्का लगाकर ले जा रहे है!#MadhyaPradesh #सिंगरौलीhttps://t.co/7uIlBCDFZq pic.twitter.com/VD6N5nSUow
— Sadaf Afreen صدف (@s_afreen7) February 11, 2023