లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. టీచర్గా, రెజ్లర్గా కెరీర్ను ప్రారంభించిన ములాయం.. ఆ తర్వాత యూపీ రాజకీయాల్లో ఓ మైలురాయిగా నిలిచారు. 1960 దశకంలో మెయిన్పురి జిల్లాలో ఓ రెజ్లింగ్ టోర్నమెంట్ జరిగింది. ఆ టోర్నీని వీక్షించేందుకు సోషలిస్టు పార్టీ ఎమ్మెల్యే నాథూ సింగ్ అక్కడకు వెళ్లారు. పొట్టిగా, గట్టిగా ఉన్న ములాయం రెజ్లింగ్ స్కిల్స్న చూసిన నాథూ సింగ్ ఇంప్రెస్ అయ్యారు. బలమైన ప్రత్యర్థులను ఈజీగా పడేస్తున్న ములాయం టెక్నిక్స్ నాథూను అట్రాక్ట్ చేశాయి. దీంతో ఆ యువ రెజ్లర్ తనను కలవాలంటూ ఎమ్మెల్యే నాథూ కోరారు. ములాయం చదువుకున్నాడని, స్థానిక జెయిన్ కాలేజీలో టీచింగ్ కూడా చేస్తున్నట్లు తెలుసుకున్న సోషలిస్టు ఎమ్మెల్యే నాథూ సింగ్ మరింత స్టన్ అయ్యారు. ఇక అప్పుడే ములాయం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ములాయంను శిష్యుడిగా మార్చుకున్నారాయన. నాథూనే ములాయంకు పొలిటికల్ గురువుగా కూడా మారారు.
1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం మొదటిసారి పోటీ చేశారు. జశ్వంత్ నగర్ నుంచి ఆయన తొలి అడుగు పడింది. 27 ఏళ్ల వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇక 1977లో ఆ రాష్ట్రానికి ములాయం తొలిసారి మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్ నేతగా తొలిసారి యూపీ సీఎంగా ములాయం బాధ్యతలు చేపట్టారు. 1991 వరకు అంటే రెండేళ్లు పాటు ఆయన సీఎంగా చేశారు. ఆ తర్వాత జనతాదళ్కు గుడ్బై చెప్పేశారు. ఆ వెంటనే సమాజ్వాదీ పార్టీని స్థాపించారు.
1970 దశకంలో రాజకీయ అనిశ్చితి ఉన్న సమయంలో .. యూపీ రాజకీయాల్లో ములాయం కీలక నేతగా ఎదిగారు. 1990 ఆరంభంలో కుల రాజకీయాలు భీకర స్థాయికి చేరాయి. ఆ సమయంలో ములాయం ఫార్ములా పెద్ద హిట్ అయ్యింది. సోషలిస్టు ఓబీసీ నేతగా ములాయం రూపాంతరం చెందారు. వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కావాలంటూ ఆయన పోరాటం చేశారు. ముస్లింలు-యాదవ్ల రాజకీయా ఫార్ములాతో ములాయం సక్సెస్ సాధించారు. 1993లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ ఫార్ములానే కీలక పాత్ర పోషించింది.
ములాయంను ఆయన మద్దతుదారులు పాపులర్గా నేతాజీ అని పిలుస్తుంటారు. 1967, 1974, 1977, 1985, 1989, 1991, 1993, 1996, 2003, 2007లో యూపీ ఎమ్మెల్యేగా ములాయం గెలిచారు. 1989-91, 1993-95, 2003-2007 వరకు ఆయన యూపీ సీఎంగా చేశారు. 1996, 1998, 1999, 2004, 2009, 2014, 2019 సంవత్సరాల్లో లోక్సభకు ఆయన ఎన్నికయ్యారు. ఇక 1996-98 వరకు దేశ రక్షణ మంత్రిగా చేశారు.