న్యూఢిల్లీ, మార్చి 30: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఓ గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వీ సూర్య నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు కేజ్రీవాల్ ఇంటిముందు నిరసనకు దిగారు. కశ్మీర్ పండిట్లను కేజ్రీవాల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
సెక్యూరిటీ బారికేడ్లను దాటుకొని ఇంటిలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. తేజస్వీ సూర్య సైతం బ్యారికేడ్లు ఎక్కారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొన్నది. ఘటనను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఖండించారు. ‘కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ గూండాలు దాడి చేశారు. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు గేటు దాకా తీసుకువచ్చారు’ అని పేర్కొన్నారు. ‘కేజ్రీవాల్ ఓ అర్బన్ నక్సల్. కశ్మీర్ పండిట్ల ఊచకోతను చరిత్ర నుంచి చెరిపేయాలని చూస్తున్నారు. అందుకే కశ్మీర్ ఫైల్స్ సినిమా అబద్ధం అన్నారు’ అని తేజస్వీ సూర్య ఆరోపించారు.