Arvind Kejriwal కశ్మీర్ లోయలోని పండిట్ల దీనగాధల్ని తెలిపే `ది కశ్మీర్ ఫైల్స్` సినిమాకు పన్ను రాయితీ ఇచ్చే విషయమై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఢిల్లీ నగర పరిధిలోని సినిమా హాళ్లలో ప్రదర్శిస్తున్న ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోద పన్ను రాయితీ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మీ యూ-ట్యూబ్ చానల్స్లో అప్లోడ్ చేయండంటూ సూచించారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు వినోద పన్ను రాయితీ ఇవ్వాలని వారు అంటున్నారు. బాగానే ఉంటుంది. యూ-ట్యూబ్లో అప్లోడ్ చేస్తే, అది అందరూ ఉచితంగా చూడటానికి వీలవుతుంది అని కేజ్రీవాల్ అన్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ నవ్వులమయమైంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు బల్లలు చరుస్తూ కేజ్రీవాల్కు మద్దతు తెలిపారు.
`మమ్మల్ని పన్ను రాయితీ ఇవ్వమని మీరెందుకు అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే.. యూ-ట్యూబ్లో అప్లోడ్ చేయమని వివేక్ అగ్నిహోత్రిని అడగండి. అప్పుడు అది అందరికి ఉచితంగా లభిస్తుంది. ఒక్కరోజులోనే ప్రతి ఒక్కరూ ఆ సినిమా చూడొచ్చు. దానికి పన్ను రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడ ఉంది` అని బీజేపీ ఎమ్మెల్యేలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్, త్రిపుర, గోవా, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ వినోద పన్ను రాయితీ కల్పించారు.
కశ్మీర్ లోయలో మిలిటెంట్ కార్యకలాపాలు పెరిగిపోవడంతో కశ్మీరీ పండిట్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వైనంపై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అసాధారణ రీతిలో కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తున్నది. బెదిరింపులు రావడంతో ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి కేంద్రం వై క్యాటగిరీ భద్రత కల్పించింది.