న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోమారు ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ ఇప్పటివరకు ఆరుసార్లు సమన్లు జారీ చేయగా, కేజ్రీవాల్ వాటిని చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ బడ్జెట్ సమావేశాల వల్ల కోర్టు విచారణకు కేజ్రీవాల్ హాజరు రాలేకపోయారని ఆయన న్యాయవాదులు కోర్టుకు గత శనివారం తెలియజేశారు. దీంతో కోర్టు విచారణ మార్చి 16కు వాయిదా పడింది. మరోవైపు కేజ్రీవాల్కు మళ్లీ సమన్లు పంపేందుకు ఈడీ సిద్ధమైంది. కోర్టు విచారణ జరుపుతుండగా మళ్లీ సమన్లు ఎలా పంపుతారని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ ఆగాలని, అలా కాకుండా పదే పదే సమన్లు జారీచేయటమేంటని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణకు.. సమన్ల జారీకి సంబంధం లేదని ఈడీ పేర్కొన్నది.