న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. గత మూడు రోజులుగా ఆక్సిజన్ సంక్షోభం నెలకొందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కొవిడ్-19 రోగుల చికిత్స కోసం ఢిల్లీకి ఆక్సిజన్ కోటా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఒడిషా నుంచి వాయుమార్గంలో ఆక్సిజన్ ను ఢిల్లీకి తరలించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాల కోటాను మరింత పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్ ట్రక్కులను కొన్ని రాష్ట్రాల్లో నిలిపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని మనమందరం సమైక్యంగా ఎదుర్కోవాలని అన్నారు. మనం విడిపోతే దేశ మనుగడకు ప్రమాదమని పేర్కొన్నారు. ఇక ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 24,638 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే 249 మంది మరణించారు.