చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతోంది. పంజాబీలపై ఇప్పటికే పలు వరాలు కురిపించిన ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం దళితులు, అణగారినవర్గాల కోసం మరిన్ని హామీలు గుప్పించారు.
హోషియార్పూర్లో జరిగిన ర్యాలీలో కేజ్రీవాల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఎస్సీ విద్యార్ధులకు ఉచిత విద్య అందించడంతో పాటు ఐఏఎస్, మెడికల్, ఐఐటీలకు ఉచిత కోచింగ్, ఉచిత విదేశీ విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 18 ఏండ్ల దాటిన మహిళలకు నెలకు రూ 1000 అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని కులం కార్డును వాడుతున్నారని ఆరోపించారు.
ఎస్సీ వర్గానికి చెందిన చన్ని తన కులం కార్డు వాడుతూ ఆ వర్గీయుల ఓట్లను అభ్యర్ధిస్తున్నారని అన్నారు. తాను ఎస్సీ కాకపోయినా మీ కుటుంబ సభ్యుడిగా ముందుకొచ్చానని చన్నీ మాత్రం కేవలం కులం పేరుతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వచ్చే ఏడాది ఆరంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక కాంగ్రెస్ను వీడి కొత్త పార్టీతో ముందుకొచ్చిన మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాషాయ పార్టీతో జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.