న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలను బలహీనపర్చడానికే కేంద్రంలోని మోదీ సర్కారు తప్పుడు కేసులను బనాయిస్తున్నదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం ఎన్ని అబద్ధాలాడుతుందంటే.. ఢిల్లీలో బస్సు కుంభకోణం జరిగిందని, తరగతి గదుల కుంభకోణమని, విద్యుత్ కుంభకోణమని, రోడ్డు నిర్మాణాల్లో అవకతవకలని, నీటి సరఫరాలో అవినీతని.. ఇలా నోటి కొచ్చిననన్ని అబద్ధాలు చెప్పింది. అవన్నీ అబద్ధాలు కాబట్టే ఒక్క కుంభకోణం నిరూపితం కాలేదు. ఇప్పుడు మద్యం పాలసీ కేసు కూడా అలాంటిదే. దీన్ని కృత్రిమంగా సృష్టించారు. అందుకే ఈడీకి ఆధారాలు లభించడం లేదు. కాబట్టి కోర్టులో నీళ్లు నములుతున్నది’ అని పేర్కొన్నారు.