న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తునకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సహకరించడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. అలాగే ఒక కీలక ప్రశ్నకు సమాధానంగా ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లను ఆయన బయటపెట్టారని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో నిందితుడైన ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్చార్జ్ విజయ్ నాయర్తో తనకు అంతగా సంప్రదింపులు లేవని, అతిషి, సౌరభ్ భరద్వాజ్లను అతడు కలిసేవాడని కేజ్రీవాల్ చెప్పారని ఈడీ వెల్లడించింది.
కాగా, ఢిల్లీలో మద్యం రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వానికి వంద కోట్ల ముడుపులు అందించిన ‘సౌత్ గ్రూప్’కు మధ్యవర్తిగా విజయ్ నాయర్ వ్యవహరించినట్లు ఛార్జిషీట్లో ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్తో తన సమావేశాన్ని విజయ్ నాయర్ ఏర్పాటు చేసినట్లు ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుడు దర్యాప్తులో చెప్పాడని ఈడీ పేర్కొంది.
మరోవైపు నేరుగా సమావేశం కుదరకపోవడంతో వీడియో కాల్ ద్వారా కేజ్రీవాల్తో సమీర్ను విజయ్ నాయర్ మాట్లాడించాడని ఈడీ తెలిపింది. వీడియో కాల్ సందర్భంగా నాయర్ తమ వ్యక్తి అని ఆయనను నమ్మవచ్చని, ఆయనతో మాట్లాడవచ్చని సమీర్తో కేజ్రీవాల్ అన్నట్లుగా ఆ ఛార్జిషీట్లో ఈడీ పేర్కొంది.