న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఉపశమనం కలిగింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఉన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ ఇద్దరికీ ఆ కేసులో నమోదు అయిన అభియోగాల నుంచి విముక్తి లభించింది. మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఢిల్లీ కోర్టు పేర్కొన్నది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర కానీ, నేరపూరిత ఉద్దేశం కానీ లేదని ఢిల్లీ కోర్టు ఇవాళ వెల్లడించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది.
మద్యం కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ పాలసీలో చోటుచేసుకున్న అక్రమాల్లో ఆ ఇద్దరి పాత్ర ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. కానీ విచారణ సమయంలో పక్కా ఆధారాలను చూపించలేకపోయినట్టు కోర్టు చెప్పింది. ప్రస్తుతం ఆ వివాదాస్పద ఎక్సైజ్ చట్టాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం అపోహల మీద తీవ్రమైన కేసును వాదించలేమని, ఆరోపణలకు తగిన రీతిలో బలమైన సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టాలని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలు ఇచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 21 మందిని ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఛార్జ్షీట్లో చాలా లోపాలు ఉన్నాయని, ఎటువంటి సాక్ష్యాలు లేని అంశాలు చాలా ఉన్నట్లు కోర్టు చెప్పింది.