న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమైందని ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తీరే కారణమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బొగ్గు కొరతతో విద్యుత్ సమస్య వాటిల్లడంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరతతో అవి పూర్తి సామర్ధ్యంతో పనిచేయడం లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మరోవైపు బొగ్గు సంక్షోభం మోదీ సర్కార్ అసమర్ధతేనని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని టార్గెట్ చేసింది. బొగ్గు కొరత మోదీ తప్పిదమని, విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాలు అనూహ్యంగా నిలిచిపోయాయని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం సాకుగా ఓ ప్రైవేట్ కంపెనీ సొమ్ము చేసుకుంటోందా.? ఈ విషయాన్ని ఎవరు నిగ్గుతేల్చుతారు? అంటూ కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ప్రశ్నించారు.