Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం (మార్చి 22) ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్పై గురువారం కోర్టు విచారణ జరుపనున్నది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రైతు, సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఢిల్లీకి చెందిన సుర్జీత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రి పదవిలో ఉండకూడదని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ పదవిలో కొనసాగడం న్యాయ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని.. న్యాయ ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తుందని ఆరోపించారు. మరో వైపు ఢిల్లీ సీఎం బుధవారం హైకోర్టులో నిరాశే ఎదురైంది. తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తీర్పును వెలువరించింది. పిటిషన్పై కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను కోరితే పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.