న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈసారి ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. మెట్రో సర్వీసులను కూడా రద్దు చేశారు. ఈ నెల 17 ఉదయం 5 గంటల వరకూ లాక్డౌన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్ కేసులు కొద్దిగా తగ్గినా.. మధ్యలో వదిలేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్లో మధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతంగా ఉండగా.. ఇప్పుడది 23 శాతానికి వచ్చింది. ఇది కూడా చాలా ఎక్కువే అని, వ్యాప్తిని మరింత అరికట్టాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు.
మొదట్లో చాలా చిన్న లాక్డౌన్ అని చెప్పి ప్రారంభించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తప్పనిసరి పరిస్థితుల్లో దానిని పొడిగిస్తూ వెళ్తున్నారు. ఢిల్లీ లాక్డౌన్ విధించి ఇది నాలుగో వారం. లాక్డౌన్ సమయంలో ఢిల్లీలో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని, ప్రధానంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, అయితే కేంద్ర సాయం వల్ల పరిస్థితి మెరుగుపడిందని కేజ్రీవాల్ చెప్పారు.